‘దత్తత వెళ్తే ఆస్తి హక్కులుండవ్‌’.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

|

Jul 04, 2023 | 10:21 AM

దత్తత వెళ్లిన సంతానానికి అసలు తల్లిదండ్రుల ద్వారా సంక్రమించే ఆస్తిపై హక్కు ఉండదని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. తమ పూర్వీకుల ఆస్తిలో సొంత కుటుంబంలోని ఇతరులతో సమాన హక్కులు కోల్పోతారని తెలంగాణ హైకోర్టు ఫుల్ బెంచ్‌ స్పష్టం చేసింది. ఒకే వ్యక్తి రెండు కుటుంబాల్లో ఉండరని..

దత్తత వెళ్తే ఆస్తి హక్కులుండవ్‌.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
Telangana High Court
Follow us on

హైదరాబాద్: దత్తత వెళ్లిన సంతానానికి అసలు తల్లిదండ్రుల ద్వారా సంక్రమించే ఆస్తిపై హక్కు ఉండదని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. తమ పూర్వీకుల ఆస్తిలో సొంత కుటుంబంలోని ఇతరులతో సమాన హక్కులు కోల్పోతారని తెలంగాణ హైకోర్టు ఫుల్ బెంచ్‌ స్పష్టం చేసింది. ఒకే వ్యక్తి రెండు కుటుంబాల్లో ఉండరని, అలాంటప్పుడు ఆస్తి ఎలా ఉంటుందని ప్రశ్నించింది. ఐతే దత్తత తీసుకోవడానికి ముందు పుట్టిన కుటుంబంలో ఆస్తి పంపకం జరిగితే, అప్పుడు వారి వాటా కింద ఆస్తిని కేటాయించినట్లయితే, దత్తతగా వెళ్లిన వ్యక్తికి ఆ ఆస్తి దక్కుతుందని కోర్టు పేర్కొంది. దత్తతకు వెళ్లక ముందు ఎలాంటి కేటాయింపు జరగకపోతే అటువంటి వారికి పుట్టిన కుటుంబంలో పూర్వికుల ఆస్తిలో వాటా ఉండదంటూ కీలక తీర్పు వెలువరిచంది.

దత్తత వెళ్లిన సంతానానికి ఎందుకు ఆస్తి హక్కు ఉండదంటే..

దత్తత వెళ్లినప్పటికీ జన్మించిన కుటుంబం ఆస్తిలో కూడా వాటా ఉంటుందంటూ ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలానికి చెందిన ఎవిఆర్‌ఎల్‌ నరసింహారావు ఖమ్మం సివిల్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు.1980లో అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ‘యార్లగడ్డ నాయుడమ్మ వర్సెస్ ఏపీ ప్రభుత్వం’లో దత్తత వెళ్లిన వ్యక్తికి సహజ కుటుంబానికి చెందిన అవిభాజ్య ఆస్తిలో కూడా స్వాభావిక హక్కు ఉంటుందని, దత్తత తీసుకున్న తర్వాత కూడా దానిపై హక్కు కొనసాగుతుందని ప్రకటించింది. ఈ తీర్పు ఆధారంగా హైకోర్టు విచారణ జరిపి సహజంగా జన్మించిన కుటుంబంలోని ఆస్తిలో వాటా ఉంటుందంటూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ నరసింహారావు సోదరుడు ఎ నాగేశ్వరరావు, కుటుంబ సభ్యులు హైకోర్టులో 1985లో దావా వేయగా.. కోర్టు దానిని కొట్టేసింది. రివ్యూ పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టేసింది.

హైకోర్టు ఫుల్‌బెంచ్‌ తీర్పు ఇదే..

ఆ తర్వాత అతను పేటెంట్‌ అప్పీల్‌ దాఖలు చేశాడు. అది 2001లో హైకోర్డు డివిజన్‌ బెంచ్‌ ముందుకు వచ్చింది. గతంలో నాయుడమ్మ కేసులో ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ అంగీకరించలేదు. దీంతో ఈ కేసును విచారించేందుకు కోర్టు ఫుల్‌బెంచ్‌ను ఏర్పాటు చేసింది. హైకోర్టులో పెండింగ్‌లో ఈ కేసును న్యాయమూర్తులు జస్టిస్‌ పొనుగోటి నవీన్‌రావు, జస్టిస్‌ బొల్లం విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్‌ నగేశ్‌ భీమపాకలతో కూడిన ఫుల్‌బెంచ్‌ సుదీర్ఘంగా విచారించి ఇటీవల తీర్పు వెలువరించింది. దత్తత వెళ్లిన తర్వాత అతను/ఆమె పుట్టిన కుటుంబంతో సంబంధాలు తెగిపోతాయి. దత్తతగా వెళ్లిన కుటుంబ బంధాలను పొందుతారని చట్టం చెబుతున్నట్లు ఫుల్‌ బెంచ్‌ తెల్పింది. పుట్టిన కుటుంబంలో దత్తతకు ముందు పూర్వీకుల ఆస్తి కేటాయించకపోతే ఎటువంటి హక్కు ఉండదని తెల్పుతూ హైకోర్టు తీర్పు వెలువరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.