
నేరాలను పట్టుకునేందుకు పోలీసులు వేసే ఎత్తులకు.. దొంగలు కూడా పైఎత్తులు వేస్తున్నారు. పోలీసులు సాంకేతికతను వాడుతుంటే, దొంగలు పోలీసులకే సవాల్ విసురుతూ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. నేరాలను అరికట్టేందుకు.. కేసులను చేధించేందుకు అందివస్తున్న టెక్నాలజీనీ పోలీసులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. కేసులను చేధించేందుకు సీసీ కెమెరాలు పోలీసులకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. అయితే రోజు రోజుకు కొత్త కొత్త ఐడియాలతో దొంగలు రెచ్చిపోతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలో తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దుండగులు చోరీకి యత్నించడం కలకలం రేపింది.
ఈ నేపథ్యంలో తమ చోరీ సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా ఉండేందుకు దొంగలు కొత్త ఐడియా వేశారు. గ్రామీణ బ్యాంకు ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలకు బ్లాక్ స్పే కొట్టి బ్యాంకులో నగదును, బంగారాన్ని దొంగిలించే ప్రయత్నం చేశారు. ముందస్తుగా షట్టర్కు ఉన్న తాళం పగలగొట్టారు. ఆ తర్వాత తమతో తెచ్చుకున్న గ్యాస్ కట్టర్తో షట్టర్ కట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ సైరన్ మోగడంతో అక్కడినుండి పరారయ్యారు. బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకొని క్లూస్ టీం ద్వారా వేలిముద్రల సేకరణ చేస్తున్నారు. సైరన్తో బ్యాంక్ ను దోపిడీ చేయాలనే దొంగల ప్రయత్నం విఫలమైంది.