
ఇప్పటి టెక్నాలజీ యుగంలో ప్రతీఒక్కరూ చేతుల్లో స్మార్ట్ ఫోన్ అనేది వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారందరూ తప్పనిసరిగా డేటా వాడుతూ ఉంటారు. ఇక వ్యాపారం లేదా ఉద్యోగ పనుల కోసమైతే హైస్పీడ్ ఇంటర్నెట్ అనేది అవసరం. ప్రస్తుతం ప్రైవేట్ సంస్థలు నెలకు రూ.600 నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ కోసం వసూలు చేస్తున్నాయి. అయితే సామాన్యులకు తక్కువ ధరకే హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో తక్కువ ధరకే ఇంటర్నెట్ సౌకర్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కనీసం 25 ఎంబీపీఎస్ వేగంతో హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం గ్రామీణులకు కల్పించేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు అధికారులు ఇప్పటికే చర్యలు ప్రారంభించగా.. త్వరలోనే ఈ సదుపాయం గ్రామాల్లో నివసించే వారికి అందుబాటులోకి రానుంది.
ఇంటింటికి డిజిటల్ సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చవక ధరకే గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు అందించనుంది. టీ ఫైబర్ నెట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ఇప్పటికే 26 జిల్లాల్లో 9 వేల గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ రింగ్ కనెక్టివిటీ ఏర్పాటు చేశారు. అయితే రంగారెడ్డి, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు వీటిని ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఈ జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. దీని వల్ల గ్రామాల్లో వైర్లు తెగి కిందపడ్డా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగదు. అన్ని గ్రామ పంచాయతీల్లోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు.
ఇప్పటికే రింగ్ కనెక్టివిటీ కోసం రాష్ట్రానికి భారత్ నెట్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.432 కోట్లు మంజూరు చేసింది. ఇక కేబుళ్ల మెయింటెనెన్స్ కోసం మరో రూ.2,697 కోట్లు, పరిపాలన వ్యయం కోసం రూ.3,185 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాయి. ఇక రింగ్ కనెక్టివిటీ ఉన్న 4 గ్రామాలకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇది విజయవంతం కావడంతో రింగ్ కనెక్టివిటీ కోసం కేంద్రం అనుమతులు ఇచ్చింది. 691 బ్లాకులను బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ లీజ్డ్ లైన్స్ కనెక్టివిటీ అందించాలని కేంద్రం తెలిపింది. అటు ఏబీపీ కార్యక్రమంలో భాగంగా 12 వేల 769 గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ సౌకర్యం కల్పించేందుకు కేంద్రం నిర్ణయించింది.బీఐఎస్ మ్యాపింగ్ ద్వారా వీటి ఆస్తులన్నీ మ్యాపింగ్ చేయాలని నిర్ణయించింది. ఇక భారత్ నెట్ ఉద్యమీస్ను నియమించాలని భావించింది. రానున్న ఐదేళ్లల్లో గ్రామాల్లోని పంచాయతీలు, అంగన్వాడీలు, స్కూళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ అందించమే ధ్యేయంగా పెట్టుకుంది.