
తెలంగాణలో మార్చి 6వ తేదీ నుంచి ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. 99 రోజుల పాటు ఇది రాష్ట్ర స్ధాయి నుంచి గ్రామ స్థాయి వరకు జరగనుండగా.. ఈ ప్రొగ్రాంలో భాగంగా సంక్షేమ పథకాలను అమలు చేయనున్నారు. కొత్త పథకాల ప్రారంభంతో పాటు ఉన్న పథకాల్లో మరింతమందికి లబ్ది చేకూర్చనున్నారు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడోసారి ఈ కార్యక్రమం చేపడుతున్నారు. దీంతో దీనిని అన్ని శాఖల అధికారులు బాధ్యత తీసుకుని విజయవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమం అమలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రభుత్వం ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్దం చేసింది. ఏయే పథకాలు ప్రారంభించాలి..? సంక్షేమ పథకాల ద్వారా ఎలా ప్రజలకు లబ్ది చేకూర్చాలి? అనే దానిపై యాక్షన్ ప్లాన్ను రూపొందించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి ఇళ్లను మంజూరు చేయనుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి విడతగా 3 లక్షల ఇళ్లను విడుదల చేసింది. ఇప్పుడు రెండో దశలో మరింత మందికి ఇళ్లను కేటాయించనుంది. స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోవాలనుకునేవారికి వీటిని మంజూరు చేయనుంది. ఇక రేషన్ కార్డుల కోసం నిరంతరం దరఖాస్తులు చేసుకునే ప్రక్రియను అమలు చేయనుంది. దీని వల్ల కొత్తగా రేషన్ కార్డు కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు అర్హత ఉంటే అధికారులు పరిశీలన చేపట్టి రేషన్ కార్డు జారీ చేస్తారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు, జారీ ప్రక్రియను ప్రభుత్వం నిరంతరం చేపట్టనుంది. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి, అధికారులు జారీ చేయడానికి ఇక నుంచి ఎలాంటి గడువు అంటూ ఉండదు.
ఈ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఇందిరా మహిళాశక్తి భవనాలను ప్రారంభించనున్నారు. అన్ని జిల్లాల్లో వీటిని ప్రారంబించనున్నారు. వీటి వల్ల డ్వాక్రా మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పించనున్నారు. ఇక అన్ని జిల్లాల్లో భారీగా జాబ్ మేళాలు నిర్వహించనున్నారు. వీటి ద్వారా లక్ష మంది యువతకు ఉద్యోగాలు ఈ 99 రోజుల్లో కల్పించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సభలు నిర్వహిస్తారు. ఈ సందర్బంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. అర్హత ఉన్నవారికి వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. ఇక ప్రజల సమస్యలు, సలహాలు, సూచనలు కూడా తెలుసుకుంటారు.