
హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు తెలంగాణ సర్కార్ శుభవార్త అందించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో లక్ష ఇందరిమ్మ ఇళ్లు నిర్మించనున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టతిచ్చారు. గురువారం నగరంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నగరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అప్డేట్ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. వీటి నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ ప్రక్రియ మరో రెండు, మూడు రోజుల్లోనే ముగియనుందని తెలిపారు. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగ్గా.. దీనికి ముందు అధికారులతో పొంగులేటి సమావేశమయ్యారు.
నగర పరిధిలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రారంభించనున్నట్లు పొంగులేటి స్పష్టం చేశారు. తొలి దశలో ప్రతీ నియోజకవర్గంలో 500 నుంచి వెయ్యి ఇళ్ల చొప్పున నిర్మించనున్నట్లు తెలిపారు. రెండు, మూడో విడతల్లో మిగిలిన ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు. పేదవారి సొంతింటి కలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. నగరంలో లబ్దిదారులపై ప్రతీ ఒక్కరికి ఇళ్లు నిర్మించి ఇస్తామని పొంగులేటి పేర్కొన్నారు. నగరంలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి స్థలాల సేకరణ తుది దశలో ఉందని, అనంతరం టెండర్లను ఆహ్వానించి పనులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ప్రతి పేద కుటుంబానికి ఇల్లు” అనే నినాదం, లక్ష్యంతో నిజాయితీగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించిందని, ప్రతీ నియోజకవర్గంలో 5500 వరకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు పొంగులేటి వివరించారు. పట్టణ ప్రాంతాలతో పాటు హైదరాబాద్లో ఎకరా భూమి రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు పలుకుతోందని, అయినా సరే పేదల కోసం విలువైన ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి వారి పేరిట పట్టాలు ఇస్తామని మంత్రి తెలిపారు. అయితే నగరంలోని పేదలు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం మంజూరు చేయనుడటంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు.