CM KCR Tour: ఇవాళ వరంగల్‌, యాదాద్రి పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

|

Jun 21, 2021 | 10:03 AM

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ.. వరంగల్‌, యాదాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

CM KCR Tour: ఇవాళ వరంగల్‌, యాదాద్రి పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
Cm Kcr Warangal And Yadadri Tour Today
Follow us on

CM KCR Warangal, Yadadri Tour: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ.. వరంగల్‌, యాదాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌, ఆరోగ్య విశ్వ విద్యాలయ నూతన భవనాలను ప్రారంభిస్తారు. అలాగే అధునిక వసతులతో వరంగల్‌ జైలు ప్రాంగణంలో నిర్మించనున్న సూపర్‌ స్పాషాలిటీ ఆసుపత్రికి భూమిపూజ చేయనున్నారు.

ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని శాఖల అధికారులు ఒకే చోట ఉండేలా.. సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో కొత్త భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇదే క్రమంతో చుట్టూ అహ్లాదం నింపే పచ్చదనం, సూర్యరశ్మి ధారాళంగా వచ్చేలా విశాలమైన గదులతో దీన్ని కట్టారు. కాకతీయుల కీర్తిని చాటేలా కలెక్టరేట్‌ భవనం ముందు కళాతోరణం కనువిందు చేస్తోంది. అలాగే.. ఐదు ఎకరాల విస్తీర్ణంలో 25 కోట్ల వ్యయంతో 5 అంతస్తుల్లో నిర్మించిన కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం కొత్త భవనాన్ని కూడా ప్రారంభిస్తారు సీఎం కేసీఆర్‌.

హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానానికి ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా సీఎం చేరుకుంటారు. అనంతరం సెంట్రల్‌ జైలు కూల్చివేసిన ప్రదేశానికి వెళ్తారు. 30 అంతస్థుల్లో నిర్మించే మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11.35 గంటలకు కాకతీయ వైద్య కళాశాల ఆవరణలో నిర్మించిన కాళోజీ హెల్త్‌ వర్సిటీ భవనాన్ని, హన్మకొండ సుబేదారి ప్రాంతంలో నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవనాన్నీ ప్రారంభిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

వరంగల్‌ పర్యటన ముగిసిన తర్వాత.. సీఎం కేసీఆర్‌ తిరుగు ప్రయాణంలో సాయంత్రం నాలుగు గంటలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. అక్కడ ఆలయ పునర్నిర్మాణాలను పరిశీలిస్తారు. శివాలయం, రథశాల, విష్ణుపుష్కరిణి పనులను పరిశీలించనున్నారు. పెద్దగుట్టపై టెంపుల్‌సిటీ లేఅవుట్‌, గండిచెరువు వద్ద నిర్మాణాలు, ప్రెసిడెన్షియల్‌ సూట్‌ను పరిశీలిస్తారు. ప్రధానాలయ ప్రాకార గోపుర సముదాయానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైటింగ్‌ను వీక్షిస్తారు. సమీక్ష చేపట్టడంతో పాటు… ఆలయ విస్తరణ చివరి దశకు చేరిన దృష్ట్యా తుది మెరుగులు దిద్దే పనులపై దిశానిర్దేశం చేయనున్నారు.

అనంతరం ఆయన రోడ్డు మార్గంలో ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌ‌స్‌కు చేరుకుంటారు. సీఎం పర్యటన సందర్భంగా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మరోవైపు.. మంగళవారం వాసాలమర్రిలో ముఖ్యమంత్రి పర్యటించనున్న సందర్భంగా సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారి ప్రియాంకవర్గీస్‌ ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు.

Cm Kcr Warangal And Yadadri Tour Schedule

Read Also…  Covid-19: కరోనా మరణ మృ‌దంగం.. ఆ దేశంలో థర్డ్ వేవ్ ప్రారంభం.. 5 లక్షలు దాటిన మరణాలు..