
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ కీలక సూచనలు చేసింది. డిజిటల్ ఈ-ఫార్మసీల అనియంత్రిత వృద్ధికి, కార్పొరేట్ సంస్థల దోపిడీ ధరల విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఫార్మా వ్యాపారులు నిరసన జ్వాలలు రగిల్చారు. ఈ మేరకు మే 20వ తేదీన అంటే బుధవారం హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో మెడికల్ షాప్లు క్లోజ్ చేయాలని నిర్ణయించారు. అఖిల భారత కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా… తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ , హైదరాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ ఒక్కరోజు సమ్మెకు దిగనున్నారు.
భారీ నిధులతో మార్కెట్లోకి వస్తున్న కార్పొరేట్ డిజిటల్ ప్లాట్ఫారమ్ల దూకుడు విస్తరణ వల్ల జంట నగరాల్లోని స్థానిక ఫార్మసీలు పూర్తిగా దెబ్బతింటున్నాయని HCDA అధ్యక్షుడు ఎ. శ్రీధర్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ… ఇది మా మనుగడ కోసం సాగిస్తున్న యుద్ధం. పెద్ద కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న అడ్డగోలు డిస్కౌంట్ల వల్ల, ముఖ్యంగా సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో తరతరాలుగా ప్రజలకు సేవలందిస్తున్న చిన్న మెడికల్ షాపులు మూతపడే పరిస్థితి వచ్చింది అన్నారు.
కరోనా మహమ్మారి సమయంలో ఆన్లైన్ డ్రగ్ రిటైల్ నిబంధనలను సడలిస్తూ తెచ్చిన తాత్కాలిక అత్యవసర నోటిఫికేషన్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. ఆన్లైన్, ఆఫ్లైన్ వ్యాపారులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని కోరారు. అయితే, ఈ సమ్మె వల్ల తెలుగు రాష్ట్రాల్లోని రోగులకు, సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రతినిధులు స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.