CESS Elections: సాధారణ ఎన్నికలను తలపించేలా సహకార ఎన్నికలు.. సెస్ కార్యాలయంపై ఎగిరిన గులాబీ జెండా..

సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం ఎన్నికలు బీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగాయి. మంత్రి కేటీఆర్‌కి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకోవడంతో..

CESS Elections: సాధారణ ఎన్నికలను తలపించేలా సహకార ఎన్నికలు.. సెస్ కార్యాలయంపై ఎగిరిన గులాబీ జెండా..
Cess Elections

Updated on: Dec 26, 2022 | 10:37 PM

సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం ఎన్నికలు బీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగాయి. మంత్రి కేటీఆర్‌కి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకోవడంతో.. బీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. 15 స్థానాలకు 75 మంది అభ్యర్థులు బరిలోకి దిగడంతో.. ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. కౌంటింగ్ సందర్భంగా గొడవలు, ఆందోళనలతో అసెంబ్లీ ఎన్నికలకు మించి జరిగాయి ఈ ఎన్నికలు. చివరకు రెండు స్థానాల్లో రీ కౌంటింగ్ వరకూ వెళ్లింది. గంభీరావు పేట కౌంటింగ్ హాల్లో బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి ఉండడంతో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. కౌంటింగ్ హాల్లో అధికారులతో వాగ్వాదానికి దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో కాసేపు కౌంటింగ్ నిలిచిపోయింది.

ఇక వేములవాడ రూరల్ స్థానంపై గందరగోళం నెలకొంది. మొదటగా బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారంటూ సంబరాలు చేసుకున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి గెలిచినట్లు ప్రకటించారు. దీంతో వేములవాడ తెలంగాణ తల్లి చౌరస్తాలో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. పోటీగా బీజేపీ నాయకులు ధర్నా చేశారు. ఒకరిపై ఒకరు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో.. లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు.

ఇవి కూడా చదవండి

చందుర్తి కౌంటింగ్ ఫలితం జాప్యం జరగడంతో బీజేపీ నాయకులు ఎన్నికల అధికారి ముందు బైఠాయించారు. చివరకు బీఆర్‌ఎస్ మద్ధతు అభ్యర్ధి విజయం సాధించినట్టు అనధికారికంగా ప్రకటన వెలువడడంతో బీజేపీ రీ కౌంటింగ్ డిమాండ్ చేసింది. మొత్తంగా 15 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 14 చోట్ల బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్ధులు విజయ కేతనం ఎగరేశారు. ఇక గడిచిన ఎన్నికల్లో సత్తా చాటుకున్నా కాంగ్రెస్ ఈ దఫా ఎన్నికల్లో పూర్తిగా డీలా పడి పోయింది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడంతో.. సెస్ కార్యాలయంపై గులాబీ జెండా ఎగిరింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..