గుడి, బడి అని తేడా లేకుండా రెచ్చిపోతున్నారు దుండగులు. సంఘవిద్రోహ చర్యలకు పాల్పడుతూ జనాలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లా బీబీనగర్ మండలంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గుర్తు తెలియని దుండగులు దేవాలయం లాంటి పాఠశాలలో క్షుద్రపూజలు నిర్వహించారు. ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు, సిబ్బంది వాటిని చూసి తీవ్ర భయాందోళన చెందారు.
బీబీనగర్ మండలంలోని భట్టుగూడ జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఏప్రిల్ 20న గుర్తు తెలియని దుండగులు క్షుద్రపూజలు నిర్వహించారు. రోజూలాగే ఉదయం ఉపాధ్యాయులు పాఠశాలకు చేరుకునేసరికి ఆఫీస్ ముందు పసుపు ,కుంకుమ కోడిగుడ్లు,బియ్యం, నిమ్మకాయలు, ఉప్పు నాణేలు చల్లి ఉండటం గమనించారు. ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ రెడ్డి వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు పోలీసులకు సమాచారం అందించారు. గురువారం అమావాస్య కావడంతో దుండగులు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఇలాంటి పనులకు అడ్డుకట్ట వేయొచ్చని ఎస్సై సైదులు స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు.