Bandi Sanjay: నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి: బండి సంజయ్

|

Oct 19, 2021 | 10:40 AM

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రైతు బంధు పథకాన్ని ఈసీ నిలిపివేసిన నేపథ్యంలో తెలంగాణ సర్కారుపై మండిపడ్డారు.

Bandi Sanjay: నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి: బండి సంజయ్
Follow us on

Bandi Sanjay – CM KCR: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రైతు బంధు పథకాన్ని ఈసీ నిలిపివేసిన నేపథ్యంలో తెలంగాణ సర్కారుపై మండిపడ్డారు. వరుస ట్వీట్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. “సీఎం కేసీఆర్ వైఫల్యం వల్లే “దళిత బంధు” పథకాన్ని నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలిచ్చింది. దళితులను మరోసారి మోసం చేసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. తన కుట్ర బుద్దితోనే దళితబంధు పథకం కింద ఒక్కరికి కూడా నిధులు విడుదల చేయకుండా ఆపారు.” అని సంజయ్ అన్నారు.

“దేశంలో బ్యాంకులు ఎప్పటికీ లబ్దిదారుల అకౌంట్లో పడిన సొమ్మును ఫ్రీజ్ చేసిన దాఖలాల్లేవు. కానీ, కేసీఆర్ మాత్రం ఉద్దేశపూర్వకంగా దళిత బంధు డబ్బులను లబ్దిదారుల అకౌంట్లో వేస్తూనే….అదే సమయంలో డ్రా చేసుకోకుండా ఫ్రీజ్ చేయించారు. దళితబంధు ప్రకటించినప్పుడు బేషరతుగా దళితులు ఆ నిధులను వాడుకుని ఉపాధి పొందవచ్చని చెప్పిన కేసీఆర్….ఆ తర్వాత మాట మార్చి షరతులు విధించారు. బ్యాంకులో పడిన నిధులను లబ్దిదారులు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించాల్సిందే.” అని బండి అన్నారు.

“కేసీఆర్ ఏదొక రకంగా ‘దళిత బంధు’ పథకాన్ని నిలిపివేయించి ఇతరులపై ఈ నెపాన్ని నెట్టాలని కుట్ర చేశారు. ఎన్నికల కమిషన్ నుండి ఆదేశాలు రాబోతున్నాయని ముందే తెలిసి, దళిత బంధుపై సమీక్ష నిర్వహించి చిలుక పలుకులు పలికారు. ఇప్పటిదాకా ఒక్క దళిత లబ్దిదారుడికి కూడా ఆ నిధులను వాడుకునే అవకాశం లేకుండా చేసినప్పటికీ…మరో రూ.250 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించి దళితుల పట్ల కేసీఆర్ మరో డ్రామాకు తెరలేపారు.” అని సంజయ్ ఆరోపణలు గుప్పించారు.

“దళితులను కేసీఆర్ మొదటి నుండి మోసం చేస్తూనే ఉన్నారు. దళితుడిని సీఎం చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీలు గాలికొదిలేయడమే ఇందుకు నిదర్శనం. తాజాగా దళిత బంధు స్కీంను నిలిపివేసి మరోసారి దగా చేశారు. తన కపట బుద్ది, నాటకాలతో దళితుల పొట్ట కొడుతున్న కేసీఆర్ కు దళితుల ఉసురు తగులుతుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు దళితులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం.” అంటూ సంజయ్ మండిపడ్డారు.

Read also: Petrol Price: పెట్రోల్ ధరలను కంట్రోల్ చేసే పనిలో కేంద్రం.. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు షురూ.?