CM KCR Announcement Highlights: టంచనుగా పదికాగానే ఓ ప్రకటన చేస్తా. నిరుద్యోగ యువతా గెట్ రెడీ అంటూ కేసీఆర్ టీజర్ వదిలారు. కేసీఆర్ ఏ ప్రకటన చేసినా సరే అది వేల కోట్ల వ్యవహారమే అయ్యే చాన్స్ ఉంది. ఇంతకీ కేసీఆర్ ఏం చెబుతారు. ఉద్యోగాల ప్రకటన ఉంటుందా… నిరుద్యోగ భృతి ఉంటుందా. లేదంటే ఏ శాఖలో ఎన్ని ఖాళీలో ఉన్నాయో చెప్పి… అన్ని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటిస్తారా? ఆ ఖాళీల భర్తీ పోను ఇంకా నిరుద్యోగ యువత ఉంటే.. వాళ్లకు భృతి కల్పిస్తామంటారా? ఏం చెప్పబోతున్నారు.. పాలసీలో ఏం చెయ్యబోతున్నారు. తెలంగాణ యువత యావత్తూ చాలా ఆశగా ఎదురుచూస్తున్న సమయం ఇది. బుధవారం ఉదయం 10గంటలు.
కేసీఆర్ ప్రకటన దేని గురించో ఆయనే చెప్పేశారు. పక్కాగా నిరుద్యోగం మీదే. ఆ నిరుద్యోగాన్ని రూపుమాపి ఉపాధి కల్పించడానికి ఏం చెయ్యబోతున్నారన్నదే ప్రశ్న. ఒకసారి మొన్నటి బడ్జెట్ కాపీ చూద్దాం. అందులో పక్కాగా ఉన్న మ్యాటర్ కొత్త ఉద్యోగాలకు గాను జీతాల కోసం 3వేల కోట్లు కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఖాళీలపై శాఖలవారీగా కేసీఆర్ రివ్యూ నిర్వహించారట కూడా. ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చెయ్యడానికి రెడీగా ఉండాలని కూడా మౌఖికంగా అధికారులకు ఆదేశాలు అందాయని కూడా అంటున్నారు. ఇదే నిజమైతే… కేసీఆర్ ప్రకటన రాష్ట్రంలో ఖాళీల సంఖ్య, శాఖల వారీగా ఖాళీలు, వాటి భర్తీకి నోటిఫికేషన్లు.. అందుకు సంబంధించిన తేదీలతో జాబ్ క్యాలెండర్పైనే ఉంటుందనేది అంచనా.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవాలి అని కోరుకోడానికి ప్రధాన కారణం నీళ్లు, నిధులు, నిమాయకాలు. నీళ్ల విషయంలో తెలంగాణ గలగలలు పారుతున్నాయి. నిధుల విషయంలో కేంద్రంతో కొట్లాట మొదటి నుంచీ ఉంటూనే ఉంది. ఇక మిగిలింది నియామకాలు. ఇది తెలంగాణ చేతిలో ఉన్న అంశం. అందుకే టీఆర్ఎస్ను విపక్షాలు పదేపదే ఉద్యోగ నిమాయకాలపై ప్రశ్నిస్తూ వస్తున్నాయి.
తెలంగాణలో శాఖల వారీగా ఉన్న ఖాళీలపై సర్వే నిర్వహించి ఆర్థిక శాఖ గత నెల ఓ రిపోర్ట్ను కేబినెట్కు అందించింది. అందులో లెక్కల ప్రకారం… మొత్తం 28శాఖల్లో 56వేల 979 ఖాళీలు ఉన్నట్లు తేల్చింది. అందులో ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలు 44వేల 22, ఆయా శాఖల పరిధిలోని గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 12వేల 957 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ DR అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అవకాశం ఉన్న ఖాళీలు. కేబినెట్కు అందిన రిపోర్ట్ ప్రకారం.. అత్యధికంగా ఖాళీలు ఉన్నది పోలీసు శాఖ. అందులో 21వేల 507 పోస్టులు భర్తీకి అవకాశం ఉంది. సంక్షేమ గురుకులాల్లో 7వేల 701 ఖాళీలున్నాయి. వైద్యశాఖలో 3వేల 3వందల 53 భర్తీ చెయ్యొచ్చు. డిగ్రీ లెక్చరర్లు ఒకవెయ్యి 62మంది, జూనియర్ లెక్చరర్లు 9వందల మంది కావాలి. రెవిన్యూ శాఖలో ఉన్నపళంగా 305 మందిని తీసుకోవచ్చు. పంచాయతీ రాజ్లో 894, నీటిపారుదల శాఖలో 721, అటవీశాఖలో 856, వ్యవసాయ శాఖలో 200, పశువైద్య విభాగంలో 244, రవాణా శాఖలో 108 ఖాళీలున్నాయి.
ఇక పీఆర్సీ రిపోర్ట్ ప్రకారం ఈ లెక్కలు కాస్త భిన్నంగా ఉన్నాయి. ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ వందకుపైగా నోటిఫికేషన్లు ఇచ్చింది. దాని ద్వారా 35వేల 724 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది టీఎస్పీఎస్సీ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వంలోని అన్ని డిపార్ట్మెంట్లలో మొత్తం లక్షా 91వేల 126 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని పీఆర్సీ నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ ప్రకటన ఎలా ఉంటుందో గానీ… తెలంగాణలో నిరుద్యోగానికి సంబంధించిన లెక్కలూ ఓ సారి చూద్దాం. కరోనాకి ముందు లెక్కల ప్రకారం చూస్తే… రాష్ట్రంలో 8లక్షల 40వేల మంది నిరుద్యోగులు ఉన్నారు. మొత్తంగా రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 2.7శాతం ఉంది. దీన్ని ఇంకాస్త లోతుగా చూస్తే పల్లెల్లో 1.2శాతం, పట్టణాల్లో 6.1శాతం మేర నిరుద్యోగం ఉందన్నది లెక్క. మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసి చూసే జాతీయ సగటు రేటు కంటే ఇది 1శాతం తక్కువే.
2015 నిరుద్యోగ వార్షిక నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో 54శాతం మంది కార్మికులుగా వ్యవసాయరంగంపై ఆధారపడి ఉన్నారు. సేవా రంగంలో 28శాతం మంది ఉన్నారు. చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లలో.. 2% పొట్టకూటి కోసం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్లున్నారు. 3% మంది డ్రైవర్లుగా, 4శాతం మంది బీడీ కార్మికులుగా ఉన్నారు. 11శాతం మంది మాత్రం సొంతగా సేద్యం చేసుకుంటున్నారు. 23శాతం వలసకూలీలు, 31శాతం మంది రోజువారీ కూలీలు ఉన్నారు. 7శాతం మంది మాత్రం ఏ ఉపాధీ లేక నిరుద్యోగులుగా మిగిలిపోయారు.
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటనను విశ్వసించలేమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కేసీఆర్ నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. ఉద్యోగాల ప్రకటన కూడా అలాంటిదేనని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను ప్రజలు గద్దెదింపడం ఖాయమని జోస్యం చెప్పారు. నిరుద్యోగులారా ఓపిక పట్టండి… ఎవరికీ లొంగాల్సిన అవసరం లేదంటూ పిలుపునిచ్చారు. కేసీఆర్ ఏ రోజైనా మాట నిలబెట్టుకున్నారా? కేసీఆర్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అన్నారు.
నారాయణ్ పేట్: 91,142 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో మక్తల్ లోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణులు బాణా సంచ కాల్చి, స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.
ఉద్యోగాల పేరుతో తెలంగాణ యువకులను మభ్యపెట్టేందుకు సీఎం కేసీఆర్ మరోసారి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ ప్రథమ డిమాండ్ ఉద్యోగాలుగా పేర్కొన్నారు.ఉద్యోగ నియామకాలపై ఇచ్చిన మాట తప్పిన సీతక్క.. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలు అంటున్నారని అన్నారు. సీఎం ప్రకటన మభ్య పెట్టేటట్లు కనిపిస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బోగస్ మాటలు పక్కన పెట్టి, ఉద్యోగ నియామకాలకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సూర్యాపేట : కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడాన్ని హర్షిస్తూ సూర్యాపేట మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి వైద్య ఆరోగ్య శాఖా కాంట్రాక్ట్ ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. స్వీట్లు పంచుకుని టపాసులు కాల్చి తన సంతోషాన్ని వ్యక్తంచేశారు.
అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటనపై నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ గ్రంథాలయంలో నిత్యం పోటీ పరీక్షలకు ప్రిపేరవుతూ ఉద్యోగ నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూస్తున్న యువత ఈ ప్రకటన పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ వెంటనే రిక్రూట్ మెంట్ ప్రారంభించాలని టీవీ9తో మాట్లాడిన నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
సీఎం కేసీఆర్ ప్రకటించిన జాబ్ మేళాను ప్రశంసించారు ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి. దేశంలో ఎక్కడాలేని విధంగా ఒకేసారి 90వేల ఉద్యోగాల ప్రకటన గొప్పగా ఉందన్నారు. టీఆర్ఎస్కు పొలిటికల్ మైలేజ్ కూడా ఉంటుదని మెచ్చుకుంటూనే.. మా ఏపీలో అయితే జీతాలకే డబ్బులేదంటూ.. జగన్ ప్రభుత్వంపై సెటైర్లు విసిరారు.
అసెంబ్లీ సాక్షిగా మెగా జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సీఎం కేసీఆర్కి ధన్యవాదాలు తెలిపారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. నిరుద్యోగ యువతకు ఇదో మంచి అవకాశమన్నారు. విపక్షాల మాటలు నమ్మవద్దని యువతకు విజ్ఞప్తి చేశారు. ఇంత పెద్దసంఖ్యలో మెగా జాబ్ మేళా మళ్లీ వచ్చే అవకాశమే లేదన్నారు. అవసరమైతే ప్రభుత్వం తరఫున కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు ఎమ్మెల్యే గువ్వల.
సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన పైన టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర రావు హర్షం వ్యక్తం చేశారు. ‘ తెలంగాణ ఉద్యమం లో విద్యార్థులు, యువత పాత్ర కీలకమైంది. ముఖ్యమంత్రి ప్రకటనతో నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల కల నెరవేరుతుంది. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల కల కూడా సాకారమవుతుంది’ అని నామా తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకాలు కొనసాగుతున్నాయి.
సీఎం కేసీఆర్ ప్రకటనతో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఆదిలాబాద్ జిల్లాలో యువత, టీఆర్ఎస్ శ్రేణులు బాణాసంచా కాల్చి ‘జై తెలంగాణ, జై కేసీఆర్’ అంటూ నినాదాలు చేశారు. ఇక అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన కీలక ప్రకటనను చూసేందుకు తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపించారు. కొంతమందైతే కారులో యూట్యూబ్ లైవ్ పెట్టుకొని మరీ కేసీఆర్ ప్రసంగాన్ని వీక్షించారు.
సీఎం కేసీఆర్ ఉద్యోగ నియామకాల ప్రకటన పట్ల తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం శుభపరిణామమని వారు కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. కేసీఆర్ ప్రకటనతో పాఠశాలల్లో, కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో ఉపాధ్యాయుల ఖాళీల భర్తీతో విద్యార్థులకు మేలు చేకూరుతుందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
ఉద్యోగాల భర్తీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్భాటం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. ‘ తెలంగాణలో 1,91000 ఖాళీలు ఉన్నాయని బిస్వాల్ కమిటీ నివేదికలో తేలింది. ఇప్పుడేమో కేవలం 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి ఇంత ఆర్భాటం అవసరం లేదు. ఎన్నో వేలమంది విద్యార్థుల ఆత్మత్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఈనోటిఫికేషన్ తో వారికి ఎలాంటి ప్రయోజనం చేకూరదు’ అని జీవన్ రెడ్డి కేసీఆర్ పై మండిపడ్డారు.
తెలంగాణలోని నిరుద్యోగులకు అసెంబ్లీ సాక్షిగా వరాల జల్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ వయోపరిమితి విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఉద్యోగాల భర్తీలో జనరల్ అభ్యర్థుల వయో పరిమితి 44 ఏళ్లకు, SC/ST/BC అభ్యర్థులకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లు వయో పరిమితిగా నిర్ణయించారు.
అసెంబ్లీ లో 80వేలకు పైగా ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటన తో ఉస్మానియా యూనివర్సిటీ లో టీఆర్ఎస్వీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఫొటో కి పాలాభిషేకం చేశారు.ఇక తెలంగాణ భవన్ లో సంబరాలు మిన్నంటాయి. ‘నిరుద్యోగ బంధు కేసీఆర్’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
తెలంగాణ చరిత్రలో మార్చి9 చారిత్రాత్మక రోజు అని ఎమ్మెల్సీ కవిత అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆమె టీవీ9తో మాట్లాడారు. ’80వేల కు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయించడం హర్షణీయం. బీజేపీ,కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. దేశంలో2 కోట్ల ఉద్యోగల భర్తీ చేస్తామన్న బీజేపీ ఎందుకు మాట తప్పిందో సమాధానం చెప్పాలి. నిరుద్యోగులు విపక్షాల ట్రాప్ లో పడి కోర్టు లకు వెళ్లొద్దు. నిరుద్యోగ భృతి పై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం’ అని కవిత చెప్పుకొచ్చారు.
రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దేశ చరిత్రలోనే కీలక ఘట్టమని ఈ సందర్భంగా కేసీఆర్ అభివర్ణించారు.
తెలంగాణలోని నిరుద్యోగులకు కేసీఆర్ ఎలాంటి వరాలు ప్రకటించనున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారా? లేదా నిరుద్యోగ భృతి ప్రకటించనున్నారా? అన్నదానిపై సందిగ్ధత కొనసాగుతోంది. అయితే జాబ్ క్యాలెండర్ వైపే సర్కారు మొగ్గుచూపే అవకాశాలున్నాయని, సుమారు లక్ష ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది.
తెలంగాణ నిరుద్యోగులకు వరాలిస్తామని నిన్న వనపర్తి సభలో కీలక ప్రకటన చేసిన సీఎం కేసీఆర్ బుధవారం అసెంబ్లీకి అరగంట ముందుగానే చేరుకున్నారు. కాగా నేడు శాసనసభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. సభ ప్రారంభం కాగానే నేరుగా బడ్జెట్పై సాధారణ చర్చ జరగనుంది. మరోవైపు అసెంబ్లీలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. రైతు ఆత్మహత్యలు, రుణమాఫీ, ధాన్యం కొనుగోలు.. ఇతర రైతుల సమస్యలపై వాయిదా తీర్మానం ఇచ్చింది.