నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయిని దాష్టీకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న మధ్యాహ్నం గం.3.30నిమిషాలకు ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి ప్రభాత భేరీ పాటలు సాధన చేయిస్తున్నాడు. ఇంతలో అటు పక్కగా వెళ్తున్న తొమ్మిదో తరగతి విద్యార్థిని నవ్విందని ఆగ్రహించాడు. అంతే.. కాలికి ఉన్న చెప్పును విద్యార్థిని పైకి విసిరాడు. అది కాస్త ఆ పక్కనే ఉన్న మరో విద్యార్థినికి తాకింది. అయితే ఆ చెప్పు అసలు విద్యార్థినిని తాక లేదని సదరు విద్యార్థినిని మళ్ళీ విచక్షణా రహితంగా బాదాడు. ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి కొట్టడంతో విద్యార్థినిలకు శరీరంపై తీవ్ర గాయాలు అయ్యాయి.
ఇక పాఠశాలలో జరిగిన విషయాన్ని విద్యార్థినిలు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఇవాళ ఉదయం పాఠశాలలోనే ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డికి దేహశుద్ధి చేశారు. పాఠశాలలో కాసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. గ్రామస్తులు జోక్యం చేసుకొని ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డిని అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యయుడుని కలిసిన బాధ్యుడైనా టీచర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఘటనపై ప్రధానోపాధ్యాయుడు విష్ణుమూర్తి స్పందించారు. విద్యార్థినిలు ఘటన విషయాన్ని తమ దృష్టికి తీసుకురాగానే శ్రీనివాస్ రెడ్డిని మందలించానని చెప్పారు. నిన్నా, ఇవాళ జరిగిన ఘటనలను విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమాచారం పంపినట్లు తెలిపారు.
కాగా, ఉపాధ్యాయుడి తీరుపై ఉన్నతాధికారులు స్పందించారు. జరిగిన ఘటనపై విద్యాశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. MEO నివేదిక ఆధారంగా ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ DEO ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలిసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..