
చేతబడి చేస్తున్నాడనే అనుమానం ఓ వ్యక్తిలో కక్షను పెంచింది. ఆ కక్ష చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఓ దారుణ హత్య కేసు మిస్టరీ ఛేదనలో వెలుగులోకి క్షుద్రపూజల కోణం వెలుగుచూసింది. నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం రేవల్లి గ్రామానికి చెందిన కర్రెల యాదయ్య ఈ నెల 26న రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం గ్రామ శివారులో మృతుడిని అడ్డగించి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలు, రక్తస్రావంతో యాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపడంతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయడంతో స్థానికంగా మంత్రాలు చేస్తాడనే ఆరోపణలు వచ్చాయి. దీనికి తోడు శాస్త్రీయ ఆధారాలు, సాక్షుల విచారణ, సాంకేతిక ఆధారాల పరిశీలనలో నిందితుడిని గుర్తించారు. ఈ నెల 29 అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. రేవల్లి గ్రామానికి చెందిన పోలే అంజనేయులే ఈ హత్య చేశాడని పోలీసుల ఎదుట అంగీకరించాడు.
ఇక గత కొంతకాలంగా అనారోగ్యం, కుటుంబ సమస్యలతో నిందితుడు అంజనేయులు బాధపడుతున్నాడు. ఈ క్రమంలో జాతకాలు చెప్పే వారి మాటలు, గ్రామంలో ఉన్న మూఢ నమ్మకాల ప్రభావంతో మృతుడు యాదయ్య తనపై చేతబడి నమ్మి అతడిపై కక్ష పెంచుకున్నాడు. ఆ కక్షతోనే యాదయ్యను కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. మిస్టరీగా ఉన్న హత్య చేసును కేవలం 48గంటల్లోనే పోలీసులు చేధించారు. నిందితుడి వద్ద నుంచి కత్తి, ద్విచక్ర వాహనం, ఘటన సమయంలో ధరించిన దుస్తులు, సెల్ ఫోన్ ను స్వాధినం చేసుకున్నారు. అనంతరం నిందితుడు అంజనేయులును అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.
ఇక యాదయ్య హత్యోదంతం స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఇక ప్రజలు మూఢనమ్మకాలను విశ్వసించకుండా… శాస్త్రీయ దృక్పథం, చట్టంపై విశ్వాసంతో ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..