
క్యాన్సర్ మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. విభిన్న రకాల క్యాన్సర్స్ మనుషులపై దండెత్తుతున్నాయి. జీవనశైలి మార్పులు, పర్యావరణ కాలుష్యం, అవగాహన లోపం, ఆలస్యంగా నిర్ధారణ వంటి కారణాల వల్ల ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ప్రతి ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భారత్లోనూ పరిస్థితి భయానకంగా మారుతోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో క్యాన్సర్కు చెక్ చెప్పే ఓ అద్భుత ప్రకృతి వరం తెలంగాణలో వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లాలోని వ్యవసాయ భూముల రైజోస్ఫియర్ నేల నుంచి శాస్త్రవేత్తలు సేకరించిన సూక్ష్మజీవుల్లో అద్భుత ఔషధ గుణాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో కొన్ని బ్యాక్టీరియా జాతులు క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే సహజ సమ్మేళనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది.
ఈ పరిశోధనను తమిళనాడు రాష్ట్రానికి చెందిన అలగప్ప విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డా. సంజీవ్ కుమార్ సింగ్ నేతృత్వంలో జట్టు నిర్వహించింది. రంగారెడ్డి నేలలో నుంచి క్లెబ్సియెల్లా న్యుమోనియే, క్లెబ్సియెల్లా క్వాసిన్యుమోనియే, స్ట్రెప్టోమైసెస్ మినుటిస్క్లెరోటికస్, స్ట్రెప్టోమైసెస్ ప్యూసెటియస్ వంటి నాలుగు ప్రత్యేక బ్యాక్టీరియా జాతులు గుర్తించారు.
ఈ జాతుల జన్యు స్థాయి విశ్లేషణ కోసం జన్ బ్యాంక్లో టెస్టులు నిర్వహించారు. ముఖ్యంగా స్ట్రెప్టోమైసెస్ ప్యూసెటియస్ అనే జాతి అత్యధిక యాంటీ-క్యాన్సర్ యాక్టివిటీని చూపించింది. ఈ బ్యాక్టీరియా ప్యూసెమైసిన్ అనే సహజ సమ్మేళనాన్ని ఉత్పత్తి చేస్తుందని.. దీనికి యాంటీ-బాక్టీరియల్, యాంటీ-ట్యూమర్ లక్షణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఇవి బయోటెక్నాలజీ ఆధారిత ప్రక్రియల ద్వారా క్యాన్సర్, సూక్ష్మజీవ జబ్బుల చికిత్సకు వాడతగిన ఔషధ సమ్మేళనాలుగా మారే అవకాశం ఉంది.
ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో క్యాన్సర్కు చికిత్సలో పెద్ద మైలురాయిగా మారవచ్చని శాస్త్రవేత్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మన నేలలో దాగి ఉన్న ఔషధ గుణాల్ని పరిశోధనలు వెలికి తీయడం ద్వారా ప్రపంచానికి ఉపయోగపడే కొత్త మార్గాలు అందుబాటులోకి రావడం ఆశాజనక పరిణామంగా చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..