Telangana: అన్నా ఒక్కసారి లేవన్నా.. రాఖీ తెచ్చిన.. గుండెలు పగిలేలా ఏడ్చిన చెల్లెలు.. ఏం జరిగిందంటే..?
రక్షాబంధన్ వేళ నవ్వులు విరియాల్సిన ఆ ఇంట్లో.. గుండెలు పగిలే రోదనలు మిన్నంటాయి. నిండు నూరేళ్లు తోడుంటాడనుకున్న అన్న చేతికి ఎంతో ముచ్చటపడి కొనిపెట్టుకున్న రాఖీ.. చివరికి ఆయన మృతదేహానికి కట్టాల్సి వస్తుందని ఆ చెల్లెలు కలలో కూడా ఊహించలేదు. షాద్నగర్లో జరిగిన ఈ విషాదఘటన గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

రాఖీ పండుగ అంటేనే అన్నాచెల్లెళ్ల అనురాగానికి, ఆత్మీయ అనుబంధానికి ప్రతీక. తోబుట్టువుల చేతికి రాఖీ కట్టి తమకు జీవితాంతం రక్షణగా, అండగా నిలవాలని సోదరీమణులు ఆశీస్సులు కోరుకునే పవిత్ర వేడుక. కానీ రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో చోటుచేసుకున్న ఓ హృదయ విదారక ఘటన ఆ పండుగ వేళ తీరని విషాదాన్ని మిగిల్చింది. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అన్న చేతికి కట్టాల్సిన రాఖీని.. విధి వంచించడంతో చివరికి ఆయన మృతదేహానికి కట్టి కన్నీరుమున్నీరైంది ఓ నిస్సహాయ సోదరి. షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్పల్లి గ్రామానికి చెందిన నవీన్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం ఎప్పటిలాగే ఓ దుకాణంలో ఎలక్ట్రికల్ మరమ్మతు పనులు చేస్తుండగా ఊహించని ప్రమాదం జరిగింది. పనులు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురవడంతో నవీన్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. చేతికొచ్చిన యువకుడు కళ్లముందే విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
రాఖీ పౌర్ణమి సమీపిస్తుండటంతో అన్నకు స్వయంగా రాఖీ కట్టాలని సోదరి పూజిత ఎంతో ముచ్చటపడి ముందుగానే అందమైన రాఖీని కొని సిద్ధం చేసుకుంది. పండుగ రోజున ఎంతో ఆనందంగా అన్నకు తినిపించి, రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకోవాలనుకున్న ఆమె కలలు కల్లలయ్యాయి. అన్న మరణవార్త విన్న పూజిత గుండెలవిసేలా రోదిస్తూ ఘటనా స్థలానికి చేరుకుంది. అప్పటికే విగతజీవిగా పడి ఉన్న తన అన్నను చూసి తట్టుకోలేకపోయిన పూజిత, కన్నీటి వీడ్కోలు పలుకుతూ చివరిసారిగా నవీన్ చేతికి రాఖీ కట్టింది. బతికుండగా ప్రేమతో కట్టాల్సిన రాఖీని, మృతదేహానికి కడుతూ ఆమె పెట్టిన రోదనలు అక్కడున్న స్థానికులు, గ్రామస్థులందరినీ కంటతడి పెట్టించాయి. పండుగకు ముందు జరిగిన ఈ విషాద ఘటనతో చటాన్పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

