Telangana: ఒక్క నిర్ణయం డబుల్ బెనిఫిట్.. బెల్ట్ షాపుల నియంత్రణకు ఆ గ్రామ సర్పంచ్ వినూత్న ప్రయోగం
గ్రామాల్లో విచ్చలవిడిగా పెరుగుతున్న బెల్ట్ షాపులను అరికట్టేందుకు ఓ గ్రామ సర్పంచ్ ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింత్రియాల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉషారాణి తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకూ ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటనేగా మీ డౌట్ అది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ప్రస్తుతం పల్లె, పట్నం అనే తేడా లేకుండా బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చింత్రియాల గ్రామంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో యువత మద్యానికి బానిసలవుతున్నారని, సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కిరాణా షాపుల్లో సైతం మద్యం దొరుకుతుండటంతో స్థానిక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో బెల్ట్ షాపుల నియంత్రణకు సర్పంచ్ ఉషారాణి నడుం బిగించారు.
గ్రామ పెద్దలు, పంచాయతీ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా సమావేశమైన సర్పంచ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో విచ్చలవిడిగా ఉన్న అన్ని బెల్ట్ షాపులను రద్దు చేసి, గ్రామం మొత్తానికి ఒకే ఒక్క బెల్ట్ షాప్ నిర్వహించేలా తీర్మానించారు. ఆ ఒక్క షాప్ నిర్వహణ హక్కుల కోసం పంచాయతీ ఆధ్వర్యంలో బహిరంగ వేలం పాట నిర్వహించి. ఈ వేలంలో ఎవరైతే అత్యధిక మొత్తానికి పాడుకుంటారో, వారికే ఏడాది పాటు గ్రామంలో మద్యం విక్రయాలు జరిపే బాధ్యతను అప్పగిస్తాం అన్నారు.
వేలం ద్వారా వచ్చిన భారీ ఆదాయాన్ని గ్రామంలోని దేవాలయాల అభివృద్ధికి, ప్రభుత్వ పాఠశాలల అవసరాలకు, ఇతర సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తామని సర్పంచ్ తెలిపారు. దీంతో సర్పంఞచ్ తీసుకున్న వినూత్న నిర్ణయంతో గ్రామానికి డబుల్ బెనిఫిట్ చేకూరుతోందని గ్రామస్తులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా బెల్ట్ షాపుల నిర్వహణకు చట్టబద్ధత లేదు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఇవి అక్రమ అమ్మకాల కిందికే వస్తాయి. అలాంటిది పంచాయతీనే స్వయంగా వేలం వేసి బెల్ట్ షాపును కేటాయించడం కొంత వివాదాస్పదంగా మారినప్పటికీ, విచ్చలవిడి అక్రమ మద్యం విక్రయాలను అడ్డుకోవాలనే సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని స్థానికులు స్వాగతిస్తున్నారు. మొత్తానికి మద్యాన్ని అరికట్టేందుకు చింత్రియాల సర్పంచ్ చేపట్టిన విధానం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
