
ఇళ్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంట్లో దోచుకోవడానికి ఏమి లేకపాయే అని ఏడ్చాడంట మరొకడు. ఇలాంటి ఘటనే మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటి పరిధిలో చోటు చేసుకుంది. మనిషి స్వార్ధం ఎంతటి ప్రమాదంలో అయినా లాభం చూసుకుంటుంది అన్న తీరే కనిపించింది. లక్షెట్టిపేట మండలం ఇటిక్యాల సమీపంలోని జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సంతూర్ సబ్బుల లోడ్తో వెళ్తున్న లారీని కేటీసీ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు లారీల క్యాబిన్లు నుజ్జు నుజ్జయ్యాయి. ఇద్దరి డ్రైవర్లకు తీవ్ర గాయాలు కాగా.. సంతూర్ సబ్బుల లారీ క్యాబిన్లో ఇరుక్కుని డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. జనాలు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా ప్రమాదానికి గురైన సంతూర్ సబ్బుల లోడ్ను పోటీ పడి మరీ ఖాళీ చేశారు. ఓ వైపు మనుషుల ప్రాణాలు పోయాయని తెలిసినా అవేమి పట్టించుకోకుండా సబ్బులను పోటీ పడి మరీ ఎత్తుకెళ్లారు. ఇరుకు రోడ్డు కావడంతో భారీగా ట్రాపిక్ జాం అయింది. రంగంలోకి దిగిన పోలీసులు.. మిగిలిన సంతూర్ సబ్బులను కాపాడే ప్రయత్నం చేశారు.
ప్రమాదం జరిగిందనే మానవత్వాన్ని మరిచి దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా సబ్బులను ఎత్తుకెళ్లిన స్థానికుల తీరుపై పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. కొందరైతే సంతోషంతో ఉప్పొంగి మరీ సబ్బులను ఎత్తుకెళ్లడం కనిపించింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో లారీ డ్రైవర్, క్లీనర్లను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.