చదువు ఎక్కువ.. జీతం తక్కువ.. GHMC ఐటీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూస్తే షాక్!
హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ విడుదల చేసిన తాజా ఐటీ నియామకాల నోటిఫికేషన్ ఇప్పుడు చర్చకు కారణమైంది. మంచి చదువు, అనుభవం ఉన్న ఐటీ నిపుణులను నియమించేందుకు ముందుకొచ్చినా, వారికి ప్రకటించిన నెల జీతాలు చాలా తక్కువగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా, జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న శాశ్వత శానిటేషన్ సిబ్బంది జీతాలతో పోలిస్తే ఐటీ ఉద్యోగాలకు నిర్ణయించిన వేతనాలు తక్కువగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) విడుదల చేసిన తాజా ఐటీ నియామకాల నోటిఫికేషన్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. అధిక అర్హతలు, అనుభవం ఉన్న ఐటీ నిపుణులను నియమించేందుకు ముందుకొచ్చింది. అయితే, వారికి నిర్ణయించిన నెలవారీ వేతనాలు చాలా తక్కువగా ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జీహెచ్ఎంసీ ఒక ఏడాది కాలానికి ఔట్సోర్సింగ్ విధానంలో 25 మంది ఐటీ నిపుణులను నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో హార్డ్వేర్ ఇంజనీర్లు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్లు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లు, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్లు, ప్రోగ్రామర్లు, టీమ్ లీడర్లు, జీఐఎస్ అనలిస్టులు, వెబ్ డిజైనర్లు వంటి పోస్టులు ఉన్నాయి.
నోటిఫికేషన్ ప్రకారం, 12 మంది హార్డ్వేర్ ఇంజనీర్లకు నెలకు రూ.28 వేల వేతనం నిర్ణయించారు. మూడేళ్ల అనుభవంతో పాటు ఎంటెక్ అర్హత ఉన్న సీనియర్ జీఐఎస్ అనలిస్టుకు రూ.37 వేల జీతం, అలాగే బీటెక్తో పాటు ఆరు సంవత్సరాల అనుభవం ఉన్న వెబ్ డిజైనర్కు రూ.42 వేల వేతనం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ వేతనాలు ప్రస్తుత మార్కెట్ ప్రమాణాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయని అభ్యర్థులు భావిస్తున్నారు.
ఇక మరోవైపు, GHMCలో శాశ్వత శానిటేషన్ సిబ్బంది తీసుకుంటున్న వేతనాలతో పోలిస్తే ఐటీ ఉద్యోగాల జీతాలు తక్కువగా ఉండటం చర్చనీయాంశమైంది. కొత్తగా చేరిన శానిటేషన్ సిబ్బందికి నెలకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు జీతం లభిస్తుండగా, సర్వీసు పెరిగిన వారికి రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు వేతనం అందుతోంది. ఈ తేడాపై సామాజిక మాధ్యమాల్లో, ఉద్యోగ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత విద్య, సాంకేతిక నైపుణ్యం అవసరమైన ఐటీ ఉద్యోగాలకు ఇంత తక్కువ వేతనం ఎలా నిర్ణయించారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంపై GHMC అధికారులు స్పందిస్తూ, ఔట్సోర్సింగ్ ఐటీ ఉద్యోగుల వేతనాల్లో గత ఐదేళ్లుగా ఎలాంటి మార్పు జరగలేదని తెలిపారు. 2022 నుంచి అమల్లోకి రావాల్సిన పీఆర్సీ నిబంధనలు ఇంకా అమలు కాలేదని, అందువల్ల పాత వేతనాలే కొనసాగుతున్నాయని వివరించారు. సాఫ్ట్వేర్ అభివృద్ధి, వెబ్ అప్లికేషన్ నిర్వహణ, సర్వర్లు, నెట్వర్క్ వ్యవస్థలు, కంప్యూటర్లు, ప్రింటర్లు, అలాగే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (MIS) విభాగానికి సాంకేతిక సహాయం అందించే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ ఐటీ నిపుణులకు ప్రకటించిన వేతనాలు సరిపోవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ నోటిఫికేషన్పై చర్చ మరింత హీట్ పెంచింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
