
బైక్ కొనివ్వడం లేదని గొడవపడ్డ ఓ యువకుడు బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మామిడ్గిలో చోటుచేసుకుంది. మామిడ్గికి చెందిన సాల్మన్ గత కొన్నాళ్లుగా ద్విచక్ర వాహనం కొనివ్వాలని తల్లితో గొడవ పడుతున్నాడు. గురువారం ఉదయం మరోసారి బైక్ విషయంలో తల్లితో గొడవపడ్డాడు. బైక్ కొనకపోతే చచ్చిపోతానంటూ బెదిరించాడు.. చివరకు స్పందించలేదని సాల్మాన్.. గ్రామ శివారులోని వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లి.. దానిలో దూకాడు. వెంటనే బావి దగ్గరకు పరుగులు తీసిన తల్లి, భార్య స్ధానికులకు సమాచారం ఇచ్చారు. దీంతో అందరూ అక్కడికి చేరుకున్నారు.
ఈ క్రమంలో బావిలో దూకిన సాల్మాన్.. మరో ప్లాన్ రచించాడు.. బావిలో దూకిన తరువాత ఫుట్బాల్ పైపును పట్టుకొని కొంచెం పైకి వచ్చాడు.. అక్కడ కూడా బైక్ కొంటారా..? లేదా ? అంటూ బేరాలకు దిగాడు. ఎట్టకేలకు సాల్మాన్ తల్లి, భార్య.. కొంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్థులు తాడు సాయంతో సాల్మాన్ ను బయటకు తీసుకువచ్చారు..
లోతైన బావిలోకి దూకిన సాల్మాన్ కు ఎలాంటి గాయాలు కాకుండా బయటికి రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..