
ప్రస్తుత కాలంలో ఆస్తిపాస్తులు, చిన్న చిన్న గొడవలతో తోడబుట్టిన అన్నదమ్ములే శత్రువులుగా మారుతున్న రోజులివి. కానీ ఆ రక్త సంబంధం గొప్పతనాన్ని చాటిచెప్పాడు ఓ తమ్ముడు. తన అన్న సర్పంచ్గా గెలవాలని మొక్కుకుని ఆ మొక్కు తీర్చుకోవడానికి ఏకంగా 130 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఒగ్గు శ్రీనివాస్, ఒగ్గు వెంకటేష్లు ఇద్దరు అన్నదమ్ములు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్న శ్రీనివాస్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అన్న గెలుపును తన గెలుపుగా భావించిన తమ్ముడు వెంకటేష్.. తన అన్న ఎలాగైనా విజయం సాధించాలని ఆ కొమురవెల్లి మల్లన్నను వేడుకున్నాడు.
“అన్న గెలిస్తే నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తాను స్వామీ” అని వెంకటేష్ మొక్కుకున్నాడు. ఎన్నికల ఫలితాల్లో అన్న శ్రీనివాస్ ఘన విజయం సాధించడంతో ఆ తమ్ముడి ఆనందానికి అవధులు లేవు. అన్న విజయం సాధించిన వెంటనే, తన మొక్కును తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. సదాశివపేట నుంచి కొమురవెల్లి మల్లన్న క్షేత్రం వరకు సుమారు 130 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎండను సైతం లెక్కచేయకుండా తన అన్న మీద ఉన్న ప్రేమతో వెంకటేష్ పాదయాత్ర ప్రారంభించాడు. అలుపెరగని ఉత్సాహంతో నడుస్తూ కొమురవెల్లి చేరుకున్నాడు. అక్కడ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నాడు. అన్న గెలుపు కోసం ఇంత కష్టపడిన తమ్ముడిని చూసి వెంకటాపూర్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలంలో ఇలాంటి తమ్ముడు దొరకడం అన్న అదృష్టం అని కొనియాడుతున్నారు.