
ఆదిలాబాద్, మే 11: తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన భాగ్యశ్రీ జీవితంలో తల్లితనం అనేది ఆనందం నింపాల్సిన సమయం. గర్భం దాల్చిన తర్వాత ప్రతి నెలా ఆమె వైద్యుల సూచనల మేరకు ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్ పరీక్షలు చేయించుకుంది. ప్రతి సారి కూడా వైద్యులు “శిశువు ఆరోగ్యంగానే ఉంది.. ఎలాంటి సమస్య లేదు” అని చెప్పడంతో కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. కానీ కాన్పు జరిగిన రోజు ఆ కుటుంబం జీవితాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. జన్మించిన శిశువుకు రెండు కళ్లు లేవని తెలిసి తల్లి భాగ్యశ్రీ తీవ్ర ఆవేదనకు గురైంది. గర్భధారణ సమయంలో పలుమార్లు స్కానింగ్ చేసినప్పటికీ ఇంత పెద్ద లోపాన్ని గుర్తించకపోవడం ఎలా సాధ్యమైందని ఆమె ప్రశ్నించింది.
తనకు జరిగిన అన్యాయంపై న్యాయం కోసం భాగ్యశ్రీ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తాను మానసికంగా, ఆర్థికంగా, తీవ్రంగా నష్టపోయానని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన కమిషన్ అధ్యక్షుడు జాబేజ్ శామ్యూల్ కీలక వ్యాఖ్యలు చేశారు. గర్భధారణ సమయంలో సరైన వైద్య పరీక్షలు నిర్వహించకుండా, తప్పుడు నివేదికలు ఇవ్వడం వైద్యుల నిర్లక్ష్యానికి నిదర్శనమని కమిషన్ అభిప్రాయపడింది.
దీంతో బాధితురాలు భాగ్యశ్రీకి భారీ ఊరటనిస్తూ కమిషన్ సంచలన తీర్పు వెలువరించింది. ఆమెకు రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని, అదనంగా కోర్టు ఖర్చుల కింద రూ.34 వేలును కూడా ఇవ్వాలని ఆదేశించింది. ఈ తీర్పు వైద్య రంగంలో బాధ్యత ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేసింది. గర్భిణులకు ఇచ్చే ప్రతి నివేదిక ఒక కుటుంబ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని, వైద్యుల నిర్లక్ష్యానికి చట్టం కఠినంగా స్పందిస్తుందని ఈ ఘటన స్పష్టం చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.