YouTuber Nandana: యూట్యూబర్ నందన అరెస్ట్ కేసులో బిగ్ అప్డేట్!
నందూస్ వరల్డ్' పేరుతో సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకుని, ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తానని మోసం చేశారనే ఆరోపణలు రావడంతో ప్రముఖ యూట్యూబర్ నందనను సోమవారం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమెను శంషాబాద్ పోలీసులు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించినట్టు సమాచారం.

ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్ అయ్యారు. ఉద్యోగాల పేరిట ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు రావడంతో, ఆమె తన భర్తతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే, తాజాగా ఆమె అమెరికా నుంచి ఎమిరేట్స్ ఈకే-526 విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ఆమె పాస్పోర్ట్ తనిఖీ చేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఆమెపై లుకౌట్ నోటీసులు ఉన్నట్లు గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
కేసు వివరాలు పరిశీలించగా.. ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ (విజయవాడ) జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో 22-11-2025న ఆమెపై (ఎఫ్ఐఆర్ 515/2025) నమోదైనట్లు తేలింది. దీంతో వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఏపీ పోలీసులు హైదరాబాద్ చేరుకుని నందనను అదుపులోకి తీసుకున్నారు.
అసలు ఏమిటీ కేసు?
‘నందూస్ వరల్డ్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన ఆమె, భర్తతో కలిసి వీడియోలు చేస్తూ ఫాలోవర్లను సంపాదించుకుంది. ఆ తర్వాత భర్త మధుకర్తో కలిసి ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ అనే ప్రైవేట్ సంస్థను ఏర్పాటు చేసింది. విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసాలు ప్రాసెస్ చేయిస్తామని చెప్పి వందలాది మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక్కొక్కరి వద్ద నుంచి దాదాపు రూ.20 లక్షల వరకు వసూలు చేసి, ఆ తర్వాత బోర్డు తిప్పేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు కావడంతో నందన, ఆమె భర్త అజ్ఞాతంలోకి వెళ్లారు. వారిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయగా, తాజాగా ఎయిర్పోర్టులో ఆమె పట్టుబడ్డారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
