Telangana: ట్విన్స్ డే రోజు వాటే సీన్.. వారీద్దరూ.. వీరిద్దరూ ఏకమైన వేళ
అచ్చం ఒకేలా కనిపించే ఇద్దరు వరులు… అలాగే ఒకే రూపురేఖలతో మెరిసే ఇద్దరు వధువులు… ఒకే ముహూర్తానికి పెళ్లి పీటలపై కూర్చుంటే ఆ దృశ్యం ఎంత ప్రత్యేకంగా ఉంటుందో ఊహించండి! కామారెడ్డి జిల్లాలో అలాంటి అరుదైన ఘట్టమే ఆవిష్కృతమైంది. అది కూడా ట్విన్స్ డే రోజు..
సాధారణంగా పెళ్లి వేడుకల్లో వధూవరుల జంట చూడముచ్చటగా ఉంటేనే బంధుమిత్రులు మురిసిపోతారు. అలాంటిది, ఒకేలా ఉండే ఇద్దరు వరులు.. అచ్చం ఒకేలా ఉండే ఇద్దరు వధువులను పెళ్లి చేసుకుంటే ఆ సందడే వేరు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన దుంపటి విజయ్, వినయ్ ఇద్దరూ కవలలు. వీరిద్దరూ అచ్చం ఒకే పోలికలతో ఉంటారు. అలాగే తాడ్వాయి మండలం దేమి కలాన్ గ్రామానికి చెందిన కుమ్మరి కీర్తన, కీర్తిలు కూడా కవలలు. వీరిద్దరూ కూడా ఒకే రూపురేఖలతో ఉంటారు.ఒకే పోలికలతో జన్మించిన ఈ రెండు జంటలు మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు.ఒకే ముహూర్తానికి విజయ్-కీర్తన, వినయ్-కీర్తిలు పెళ్లి పీటల మీద కూర్చున్న దృశ్యం పెళ్లికి వచ్చిన వారందరినీ మంత్రముగ్ధులను చేసింది. అచ్చం ఒకేలా ఉన్న వధూవరులను చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఇద్దరు కవలలు, మరో ఇద్దరు కవలలను వివాహం చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతాయని ఈ పెళ్లి ఘట్టాన్ని కళ్లారా చూడటం తమ అదృష్టమని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
