Kavitha: వచ్చే ఎన్నికల కోసం కవిత సరికొత్త ప్లాన్.. రంగంలోకి ఎన్నికల మాంత్రికుడు..!
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ఎమ్మెల్సీ కవితకు వ్యక్తిగత రాజకీయ సలహాదారుగా వ్యవహరించనున్నట్లు సమాచారం.. అక్టోబర్ నుండి తన పని ప్రారంభించి, కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీకి వ్యూహరచన చేయనున్నారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. క్షేత్రస్థాయి, సోషల్ మీడియాలో కవిత బలాన్ని పెంచేందుకు పీకే మార్గదర్శనం చేయనున్నారు. ఈ ఒప్పందం కవిత రాజకీయ భవిష్యత్తుకు కీలకమని పేర్కొంటున్నారు..

తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (PK) మళ్లీ హైదరాబాద్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. గత కొంతకాలంగా ప్రత్యక్ష ఎన్నికల వ్యూహాలకు దూరంగా ఉంటున్న పీకే, ఇప్పుడు ఎమ్మెల్సీ కవితకు పొలిటికల్ అడ్వైజర్గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కవితతో ప్రశాంత్ కిషోర్ రెండు సార్లు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈసారి పీకే తన ఐ-ప్యాక్ (I-PAC) టీంతో కలిసి కాకుండా, కేవలం వ్యక్తిగత స్థాయిలో సలహాలు, సూచనలు అందించేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం.. వచ్చే అక్టోబర్ నెల నుంచి ప్రశాంత్ కిషోర్ తన పని ప్రారంభించనున్నారు.
కవిత తన సోషల్ మీడియా టీమ్కు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ, పీకే రాకతో ఆ వేగం మరింత పెరగనుంది. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పసిగట్టడంలో, సోషల్ మీడియాలో ప్రత్యర్థులను తిప్పికొట్టడంలో పీకే తనదైన ముద్ర వేయనున్నారు. రాబోయే రోజుల్లో కవిత కోసం ఐ-ప్యాక్ టీం కూడా పని చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యూహాలు కవిత రాజకీయ భవిష్యత్తుకు ఏ మేరకు ఉపయోగపడతాయో వేచి చూడాల్సి ఉంది.
కాగా.. మాజీ ఎమ్మెల్సీ కవిత TRS – తెలంగాణ రక్షణ సేన పార్టీని స్థాపించి.. వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే.. తెలంగాణ రక్షణ సేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. తెలంగాణ రక్షణ సేన పేరును ఎన్నికల సంఘం ప్రాధమికంగా ఆమోదించి.. ఏమైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో తెలపాలని వెల్లడించింది. ఈ తరుణంలోనే.. కవిత మున్ముందు మరిన్ని వ్యూహాలతో, ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
