Terrorist Plan: హైదరాబాద్‌ ఉగ్ర కుట్రలో కదులుతున్న డొంక.. మరోసారి విచారించనున్న పోలీసులు

హైదరాబాద్‌లో ఉగ్ర కార్యకలాపాలపై పోలీసులు ఆరా తీయనున్నారు. ఉగ్రకుట్ర కేసులో ముగ్గురు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. వీరిని కస్టడీ కోరుతూ..

Terrorist Plan: హైదరాబాద్‌ ఉగ్ర కుట్రలో కదులుతున్న డొంక.. మరోసారి విచారించనున్న పోలీసులు
Terrorist Plan

Updated on: Oct 13, 2022 | 10:11 AM

ఉగ్రకుట్ర కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. నాలుగు రోజుల పాటు నిందితులు జాహిద్‌, సమీయుద్దీన్‌, హసన్‌ను విచారించనున్నారు. హైదరాబాద్‌లో ఉగ్ర కార్యకలాపాలపై పోలీసులు ఆరా తీయనున్నారు. ఉగ్రకుట్ర కేసులో ముగ్గురు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. వీరిని కస్టడీ కోరుతూ పిటిషన్‌ వేశారు. దీంతో కోర్టు ఈనెల 17 వరకు అనుమతి ఇచ్చింది. టెర్రర్‌ రిక్రూట్‌మెంట్, నెట్‌వర్క్, హవాలాపై సిట్ దర్యాప్తు చేస్తోంది. జాహిద్‌కు చేరిన రూ.30 లక్షల నగదు, హ్యాండ్‌ గ్రనేడ్స్‌పై విచారిస్తారు. పాకిస్తాన్‌ నుంచి మహారాష్ట్ర మీదుగా హైదరాబాద్‌కి హ్యాండ్ గ్రనేడ్స్ వచ్చినట్టు గుర్తించారు. పాకిస్తాన్ ఉగ్రవాది ఫర్హతుల్లా గౌరీ నెట్‌వర్క్‌లో వీరు పనిచేస్తున్నారా? ఈ నెట్‌వర్క్‌ ట్రేసింగ్‌ చేసేలో పనిలో పడ్డారు పోలీసులు. ఎంతమందిని ఉగ్రవాదంవైపు మళ్లించారనే కోణంలో కూడా విచారించనున్నారు.

అయితే ఇప్పటికే.. జాహెద్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్‌ నుంచి పేలుడు పదార్థాలను.. ఫరాతుల్లా పంపినట్టు గుర్తించారు అధికారులు. గత నెల 28న జాహెద్‌కు పేలుడు పదార్థాలు అందాయి. బైక్‌పై 4 గ్రెనేడ్లు జాహెద్ తీసుకొచ్చినట్టు విచారణలో తేలింది. మూడు గ్రెనేడ్లు షమీ, మజాకు అందించాడు జాహెద్.

షమీ సెల్‌ఫోన్‌తో ఫరాతుల్లాతో జాహెద్ చాటింగ్ చేశాడు. పాక్‌లోని హ్యాండ్లర్లతో ఉగ్రకార్యకలాపాలకు స్కెచ్ వేశాడు. హైదరాబాద్‌లో సామూహిక ఉత్సవాల్లో దాడులు చేసి భారీగా ప్రాణనష్టం చేయాలని నిందితులు ప్రణాళిక వేసినట్టు అధికారులు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు. అంతే కాకుండా డబ్బుతో యువకులకు ఉగ్రవాదం వైపు మళ్లించేలా ప్లాన్ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

హైదరాబాద్‌లో భారీ విధ్వంసానికి పాకిస్థాన్‌లో పెద్ద ప్రణాళికే నడిచింది. పేలుళ్ల కోసం మూసారంబాగ్‌కు చెందిన అబ్దుల్‌ జాహెద్‌ను ఎంపిక చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, పండుగలను లక్ష్యంగా చేసుకొని మారణహోమం సృష్టించేందుకు సిద్ధమైన ముగ్గురు నిందితులను సిట్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు.. వీరి కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విచారణలో దిమ్మదిరిగే విషయాలు వెలుగుచూస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో నాలుగు రోజుల పాటు విచారించనున్నారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం