
నిర్మల్ జిల్లా పెంబి మండలం గుమ్మేన ఏంగ్లాపూర్ లో పిడుగుపాటు గురై బుధవారం ముగ్గురు రైతు కూలీలు మృతి చెందారు. ఆ ముగ్గురి మృతదేహాలను గ్రామానికి తరలించేందుకు వెళ్లిన స్థానికులకు మూడు వాగులు అడ్డు రాగా ఆరు గంటల పాటు నిరీక్షించారు. తప్పని పరిస్థితుల్లో వాగు దాటి కర్రల సాయంతో మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. బుధవారం రాత్రి పిడుగుపాటు ఘటన చోటు చేసుకోగా భారీ వర్షం కారణంగా ఏంగ్లాపూర్ చుట్టు ఉన్న మూడు వాగులు ఉప్పొంగడంతో వర్షంలోనే 16 గంటల పాటు మృతదేహాలు ఉండిపోయాయి. పోస్ట్ మార్టంకు తరలించే అవకాశం లేకపోవడంతో అతి కష్టం మీద గ్రామస్తులు ఆ మూడు మృతదేహాలను ఒడ్డుకు చేర్చడంతో వాగు వద్దే పోస్ట్ మార్టం పూర్తి చేశారు వైద్యులు.
ఏంగ్లాపూర్ గ్రామానికి చెందిన భార్య భర్తలు అలకుంట ఎల్లయ్య, ఎల్లవ్వ , రైతు బండారు వెంకటి అనే ముగ్గురు వ్యవసాయ పనుల కోసం పొలంకు వెళ్లగా భారీ వర్షం కురిసింది. సమీపంలోని మంచె వద్దకు వెళ్లగా ఒక్కసారిగా పిడుగుపడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.మృతదేహాలను గ్రామానికి తరలించే పరిస్థితి లేకపోవడంతో పెంబీ పోలీసుల సహాయంతో గుమ్మెన ఎంగ్లపూర్ నుండి సుమారు మూడు కిలోమీటర్ల మేర అతి కష్టం మీద మృతదేహాలను వాగు దాటించారు స్థానికులు.
వాగు ఒడ్డునే పోస్టుమార్టం చేయించి బాడీలను బాదిత కుటుంబ సభ్యులకు అప్పగించారు పెంబి పోలీసులు. రైతు వెంకటి పొలంలో పనులు చేసేందుకు వచ్చిన పెంబి మండలం నాగపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు పిడుగు పాటుకు బలైపోయారు. యజమాని సైతం అదే పిడుగుపాటుకు ప్రాణాలు విడిచాడు.
వీడియో చూడండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.