
యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలోని మాదాపూర్ లో కొంత వ్యవసాయ భూమిని హైదరాబాద్ కు చెందిన ఒకరు కొనుగోలు చేశారు.
అతను తన వ్యవసాయ భూమికి సూపర్ వైజర్ గా ఈసీఐఎల్ చెందిన పులి కుమార స్వామినీ నియమించుకున్నాడు. ఈ వ్యవసాయ భూమిలో చిన్నపాటి గుట్ట ఉంది. ఈ గుట్టపై ఆంజనేయుడు విగ్రహం కూడా ఉంది. సూపర్ వైజర్ గా పని చేస్తున్న కుమారస్వామికి నెలసరి వేతనం సరిపోడం లేదు. ఈజీ మనీ కోసం ఓ పథకం వేశాడు. ఆంజనేయుడి విగ్రహం కింద భూమిలో గుప్తనిధులు ఉంటాయని కుమారస్వామి భావించాడు. విజయవాడకు చెందిన రామినేని కృష్ణా కిషోర్, పాబోలు శ్రీనివాస్, ఆకుల నరసింహ రావు, ఖమ్మంకు చెందిన తాత కృష్ణకాంత్, బొమ్మల రామారంకు చెందిన వేణులతో కలిసి ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. అందరూ కలిసి గుప్తనిధుల కోసం వేట సాగించారు.
ఆంజనేయుడు విగ్రహం కింద గుర్తు చప్పుడు కాకుండా గుప్తనిధుల కోసం తవ్వకాలను చేపట్టారు. చుట్టుపక్కల వారికి ఎలాంటి అనుమానం రాకుండా వ్యవసాయ భావి కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు ప్రచారం చేశారు. ప్రత్యేక పూజలు చేసి హిటాచితో తవ్వకాలను చేపట్టారు. అయితే గ్రామానికి చెందిన కొందరికి ఈ తవ్వకాలపై అనుమానాలు కలిగాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడుతున్న ఆరుగురిని అరెస్టు చేశారు. తవ్వకాలకు వినియోగించిన హిటాచీ, కారు, పూజా సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూఢనమ్మకాలు, క్షుద్ర పూజల పేరుతో గుప్త నిధుల తవ్వకాలను చేపట్టడం నేరమని పోలీసులు చెబుతున్నారు. గుప్తనిధుల పేరుతో ఎక్కడైనా తవ్వకాలు జరిపితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.