
మనుషులు సరదాగా గడపడానికి, వాకింగ్ చేయడానికి, రిలాక్స్ అవ్వడానికి పార్కులు ఉన్నాయి. కానీ మూగ జీవాల కోసం పార్కులు ఉన్నాయన్న విషయం తెలుసా? అధికారుల వినూత్న ఆలోచనతో ఖమ్మం నగరంలో తొలి పెట్ పార్క్ ఏర్పాటు అయ్యింది. పెంపుడు జంతువులను ప్రాణప్రదంగా చూసుకునే నగరవాసులకు శుభవార్త అందించారు. అవి స్వేచ్ఛగా గంతులు వేస్తూ, ఆటపాటలతో కేరింతలు కొట్టేందుకు నగరంలో ఒక అద్భుతమైన వేదికగా పెట్స్ పార్క్ సిద్ధమైంది.
ఖమ్మం నగరంలోని 12, 20వ డివిజన్ల మధ్య సుమారు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన ‘పెట్ పార్క్’ రెడీ అయ్యింది. కేవలం జంతువులకే కాకుండా, వాటి యజమానులకు సైతం ఆహ్లాదాన్ని పంచేలా ఈ పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ పార్కులో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్, ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశారు. గోడలపై వేయించిన జంతువుల చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
మరోవైపు తమ పెంపుడు జీవులతో వచ్చే యజమానులు ఖాళీగా ఉండకుండా వారి కోసం ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ సిద్ధం చేశారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియాను నిర్మించారు. ఒకే ప్రాంగణంలో అటు పెంపుడు జంతువుల వినోదం, ఇటు మనుషుల ఆరోగ్యం కలగలిసేలా ఈ పార్కును రూపకల్పన చేయడం విశేషం. త్వరలోనే ఈ పార్కును అందుబాటులోకి రానున్నట్లు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
పార్కు వాతావరణం పెంపుడు జంతువులకు అనుకూలంగా ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పార్కు ప్రహరీలపై జంతువుల చిత్రాలను రంగురంగుల పెయింటింగ్స్ వేయించారు. పార్కు గోడలపై వేసిన చిత్రాలు.. సందర్శకులకు కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. పెంపుడు జంతువులు ఆడుకోవడానికి అవసరమైన ప్రత్యేక సామగ్రిని ఇప్పటికే మైదానంలో ఏర్పాటు చేశారు. పనులన్నీ చివరి దశకు చేరుకోవడంతో అధికారులు పార్కును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇకపై పెంపుడు జంతువుల యజమానులకు బయట రోడ్లపై ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా, మూగ జీవాలకు ఒక సురక్షితమైన ప్లే జోన్ లభించినట్లవుతుంది. నగర ప్రజలను ఎంతగానో ఆకట్టు కుంటుంది..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..