మృగశిర కార్తెకు సర్వం సిద్ధం.. ఉచిత చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి!

ఆస్తమా, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే మృగశిర కార్తె ‘చేప ప్రసాదం’ పంపిణీకి భాగ్యనగరం సిద్ధమైంది. రేపు, అంటే జూన్ 8, 2026 సోమవారం రాత్రి 9:00 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ పంపిణీ ఘనంగా ప్రారంభం కానుంది. మరుసటి రోజు జూన్ 9 మంగళవారం రాత్రి వరకు, దాదాపు 24 గంటల పాటు ఎలాంటి విరామం లేకుండా నిరంతరాయంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది.

మృగశిర కార్తెకు సర్వం సిద్ధం.. ఉచిత చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి!
Bathini Goud Brothers Fish Prasadam

Updated on: Jun 07, 2026 | 3:02 PM

ఆస్తమా, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే మృగశిర కార్తె ‘చేప ప్రసాదం’ పంపిణీకి భాగ్యనగరం సిద్ధమైంది. రేపు, అంటే జూన్ 8, 2026 సోమవారం రాత్రి 9:00 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ పంపిణీ ఘనంగా ప్రారంభం కానుంది. మరుసటి రోజు జూన్ 9 మంగళవారం రాత్రి వరకు, దాదాపు 24 గంటల పాటు ఎలాంటి విరామం లేకుండా నిరంతరాయంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది.

బతిని హరినాథ్ గౌడ్ కుటుంబం గత 176 ఏళ్లుగా ఈ సాంప్రదాయాన్ని ఒక పవిత్ర యజ్ఞంలా, ఉచితంగా కొనసాగిస్తోంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి బతికున్న కొర్రమీను చేప పిల్ల నోట్లో ఒక ప్రత్యేకమైన మూలిక ముద్దను ఉంచి, దానిని బాధితుల చేత మింగిస్తారు. ఈ చేప పిల్ల గొంతు గుండా లోపలికి వెళ్లేటప్పుడు ఊపిరితిత్తుల్లోని కఫాన్ని క్లియర్ చేస్తుందని నమ్ముతారు. ఇక పూర్తి శాఖాహారుల కోసం బతిని కుటుంబం బెల్లంతో కలిపిన ప్రసాదాన్ని ప్రత్యేకంగా అందిస్తుంది.

లక్షలాదిగా తరలివచ్చే జనం కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ను సందర్శించి, పనులను పర్యవేక్షించారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో సుమారు 1.4 లక్షల కొర్రమీను చేప పిల్లలను సిద్ధంగా ఉంచారు. భక్తుల సౌకర్యార్థం ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో భారీ ఫ్యాన్లు, కూలర్లు, నిరంతర తాగునీటి సౌకర్యం కల్పించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లను మొహరించారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడుపుతోంది.

Ponnam Prabhakar Goud

ఈ చేప ప్రసాదం తీసుకున్న వారు లబ్ధి పొందాలంటే బతిని కుటుంబం సూచించిన నియమాలను తప్పక పాటించాలి. మందు తీసుకున్న తర్వాత 45 రోజుల పాటు అత్యంత కఠినమైన డైట్ (పథ్యం) పాటించవలసి ఉంటుంది. అలాగే దీంతో పాటు వచ్చే ఆరుద్ర, పునర్వసు, పుష్యమి కార్తెల సమయంలో కూడా బతిని కుటుంబం ఇచ్చే మందు బిళ్లలను క్రమం తప్పకుండా వేసుకోవాల్సి ఉంటుంది. దేశం నలుమూలల నుండి లక్షలాది మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున, రద్దీ బారిన పడకుండా ఉండటానికి భక్తులు తెల్లవారుజామునే క్యూలైన్లకు చేరుకుంటే త్వరగా దర్శనం అవుతుంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us