గ్రామీణ మార్కెట్ వాహనాన్ని ప్రారంభించిన మంత్రి.. రైతాంగానికి కీలక సూచనలు చేసిన నిరంజన్రెడ్డి
నాబార్డు సహకారంతో కట్టంగూర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ‘గ్రామీణ మార్కెట్ వాహనాన్ని’ హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో..
నాబార్డు సహకారంతో కట్టంగూర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ‘గ్రామీణ మార్కెట్ వాహనాన్ని’ హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి మంత్రి పలు సూచనలు చేశారు.
రైతుకు గిట్టుబాటు ధర దక్కాలి. వినియోగదారులకు న్యాయమైన ధరకు కూరగాయలు, పండ్లు దొరకాలంటే దళారీ వ్యవస్థను క్రమక్రమంగా తగ్గించాల్సిన అవసరం ఉందని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. రైతు ఉత్పత్తి సంఘాలు, రైతు సహకార సంఘాల ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందని మంత్రి తెలిపారు.
రైతుబజార్లలో పండ్లు, కూరగాయల రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. రైతు నుండి ఉత్పత్తులు నేరుగా వినియోగదారులకు చేరినప్పుడే ఇద్దరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. రైతులు కూరగాయలు, పండ్ల సాగు వైపు దృష్టి సారించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని సాంప్రదాయ పంటల సాగు నుండి రైతాంగం బయటకు రావాలని మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు.
ఎకరా, రెండు, మూడు ఎకరాలలో కూరగాయలు, పండ్ల సాగుతో రైతులు అద్భుతాలు సృష్టించి లాభాలు అర్జిస్తున్నారు. కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారం ఉంటుంది. ఉద్యాన, వ్యవసాయ అధికారులతో రైతు వేదికల ద్వారా ఈ దిశగా రైతులకు నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా కట్టంగూర్ రైతుల ప్రయత్నాన్ని మంత్రి అభినందించారు.
Read more: