టీచింగ్ ఆసుపత్రుల పరిధిలో భర్తీ చేయనున్న 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామక ప్రక్రియను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. వెరిఫికేషన్ సహా, ఇతర ప్రక్రియలు పూర్తైన నేపథ్యంలో తుది ఫలితాలు విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మంగళవారం ఆరోగ్యశ్రీ పథకం అమలు, పురోగతిపై ఆర్థిక వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు నెలవారీ సమీక్ష నిర్వహించారు. డీఎంఇ, డీపీహెచ్, టీవీవీపీ పరిధిలోని ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ పథకం వినియోగించేవారి సంఖ్య పెరగటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 2021-22తో పోల్చితే, 2022-23 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నెల చివరి వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కేసులు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. డీఎంఈ పరిధిలో 72,225 నుంచి 1,08,223కు పెరగగా, టీవీవీపీలో 66,153 నుంచి 99,744కు పెరిగాయి. డీపీహెచ్ పరిధిలో కొత్తగా ఆరోగ్య శ్రీ సేవలు ప్రారంభం కావడం వల్ల 14,965 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ పెరుగుదలకు కృషి చేసిన వైద్యారోగ్య సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.
కొత్త మెడికల్ కాలేజీల ద్వారా మరిన్ని పీజీ సీట్లు అందుబాటులోకి రావడం, ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెరగటం, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరగటం, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలోని ఆసుపత్రుల్లోనూ ఆరోగ్య శ్రీ సేవలు మొదలు పెట్టడం వల్లే ఈ గణనీయమైన మార్పు సాధ్యమైందని హరీష్ రావు అన్నారు. అలాగే వెల్నెస్ సెంటర్ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు.జూమ్ ద్వారా నిర్వహించిన సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, ఆరోగ్య శ్రీ సీఈవో విశాలాచ్ఛి, డిఎంఇ రమేష్ రెడ్డి, నిమ్స్, ఎంఎన్జే డైరెక్టర్లు, ఆరోగ్య శ్రీ అధికారులు తదిదరులు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..