Medaram Jatara: మేడారానికి పోటెత్తిన భక్తులు.. 3 లక్షల పైగా భక్తులు వస్తారని అంచనా.. ప్రత్యేక భద్రత ఏర్పాట్లు

|

Feb 19, 2024 | 6:41 AM

ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు సమయం ఆసన్నమైంది. మేడారం మహాజాతర ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. దానిలో భాగంగా.. నాలుగు రోజులు ముందుగానే మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది టీఎస్‌ఆర్టీసీ. ఆదివారం నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ అధికారులు.. ఖమ్మం రీజియన్ నుండి 494 సర్వీసుల ఏర్పాటు చేశారు.

Medaram Jatara: మేడారానికి పోటెత్తిన భక్తులు.. 3 లక్షల పైగా భక్తులు వస్తారని అంచనా.. ప్రత్యేక భద్రత ఏర్పాట్లు
Medaram Jatara
Follow us on

రెండేళ్లకు ఒక్కసారి జరిగే అతి పెద్ద గిరిజన మేడారం జాతరకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి టీఎస్‌ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు ఏర్పాటు చేసింది. రాష్ట్రము నలుమూలల నుంచి మేడారం చేరుకునేందుకు ప్రత్యేక రవాణా సదుపాయాలను కల్పించింది.  ఖమ్మం, వరంగల్‌ బస్టాండ్లలో ప్రత్యేక క్యూలు సిద్ధం చేశారు అధికారులు.

ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు సమయం ఆసన్నమైంది. మేడారం మహాజాతర ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. దానిలో భాగంగా.. నాలుగు రోజులు ముందుగానే మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది టీఎస్‌ఆర్టీసీ. ఆదివారం నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ అధికారులు.. ఖమ్మం రీజియన్ నుండి 494 సర్వీసుల ఏర్పాటు చేశారు. మేడారం జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఖమ్మం రీజియన్‌లోని ఏడు డిపోల పరిధిలో 11 టీఎస్‌ఆర్టీసీ పాయింట్ల దగ్గర మౌలిక వసతుల ఏర్పాట్లపై అధికారులు వారం రోజులుగా దృష్టి సారించారు. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు, చర్ల, టేకులపల్లి, పాల్వంచ, మంగపేట, వెంకటాపురం, ఏటూరునాగారం నుంచి మేడారం జాతరకు స్పెషల్‌ బస్సులు నడుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మేడారం వెళ్లేందుకు మణుగూరు ఏటూరు నాగారం మీదుగా కొన్ని సర్వీసులు.. ఇల్లెందు- గుండాల మీదుగా మరికొన్ని బస్సులు నడిపేలా అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. మరోవైపు.. జాతర పాయింట్ల వద్ద ప్రత్యేకంగా చలువ పందిళ్లు, టెంట్లు, తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ఆయా పాయింట్లలో 450 మంది సిబ్బందిని కేటాయించారు. మహలక్ష్మి పథకం అమల్లో ఉన్నందున ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రెండు లక్షల మంది మహిళలు మేడారం జాతరకు వెళ్తారని అధికారుల అంచనా వేస్తున్నారు.

అటు.. వరంగల్‌ నుంచి కూడా మేడారం జాతరకు 6వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. 51 ప్రాంతాల్లో పికపింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. 30 లక్షల మందిని మేడారం జాతరకు తరలించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఆర్టీసీ. సుమారు 15వేల మంది ఆర్టీసీ సిబ్బంది మేడారం జాతర విధులు నిర్వహించనున్నారు. ఇదిలావుంటే.. జాతరకు ముందే మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం ఒక్కరోజే మూడు లక్షల పైగా భక్తులు మేడారం దర్శనానికి తరలి వెళ్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారానికి వచ్చే మూడు మార్గాల్లో ప్రత్యేక భద్రతతోపాటు.. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడే పార్కింగ్ ఏర్పాట్లు చేశారు పోలీసులు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..