
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని చామనపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన పశువుల కాపరి జంపం పవన్ గురువారం సాయంత్రం పశువుల మందను తోలుకుని ఇంటికి వస్తుండగా పెద్దవాగు సమీపంలో పులి దాడి చేసింది. గమనించిన పశువుల కాపరి పవన్ హుటాహుటిన పక్కనే ఉన్న మద్ది చెట్టు పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. చెట్టు పై కెక్కి పవన్ తన వద్ద ఉన్న ఫోన్ లో పులి కదలికలను రికార్డ్ చేశాడు. అదే సమయంలో పశువుల మందంలోని ఓ కోడైపై పులి దాడి చేసేందుకు ప్రయత్నించడంతో అది తప్పించుకుంది. మిగిలిన పశువులు సైతం భయంతో చెల్లాచెదురుగా పరుగులు పెట్టడంతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు పశువుల కాపరి పవన్.
వెంటనే గ్రామస్తులు డప్పులతో పెద్దగా శబ్దం చేస్తూ ఘటన స్థలానికి చేరుకోవడంతో పులి అడవిలోకి పారిపోయింది. విషయం తెలుసుకున్న బద్దంపల్లి, చామనపల్లి అటవీ సెక్షన్, బీట్ అధికారులు స్వామి, స్వరూప, రాజ్ కుమార్, హేమంత్ ఘటనా స్థలానికి చేరుకుని వెళ్లి పులి పాదముద్రల కోసం వెతికారు… పాదముద్రలు లభించకపోవడంతో తప్పుడు ప్రచారం అని భావించారు. పవన్ వీడియోలు చూయించడంతో మరింత ముందుకు వెళ్లి పులి పాదముద్రలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎట్టకేలకు సంఘటన స్థలానికి మూడు కిలోమీటర్ల దూరంలోని బమ్మెన అటవీ ప్రాంతం సమ్మక్క తల్లి గద్దెల వద్ద పులి పాదముద్రలు గుర్తించారు. పులి సంచారం నేపథ్యంలో చామనపల్లి, బద్దంపల్లి గ్రామాల ప్రజలను అలర్ట్ చేశారు. పశువుల కాపరులు అడవిలోకి పశువులను మేతకు తీసుకు వెళ్లవద్దని కోరారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.