ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీ తరుఫున గెలిచింది ఇద్దరే ఎమ్మెల్యేలు. ఇప్పుడు వారికి కూడా పదవీ గండం వెంటాడుతోంది. ఎన్నికల అఫిడవిట్లో సమాచారం సరిగ్గా పేర్కొనలేదంటూ ప్రత్యర్థులు కోర్టుకు వెళ్లడంతో ఆ ఇద్దరికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయట. అందులోనూ ఒక ఎమ్మెల్యేకు గతంలోనే న్యాయస్థానంలో ఎదురుదెబ్బ సైతం తగిలింది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కేవలం రెండు స్థానాలు మాత్రమే. ఆ రెండు కూడా నడిగడ్డలోని అలంపూర్, గద్వాల్ అసెంబ్లీ నియోజకవర్గాలు. అలంపూర్ నుంచి విజయుడు, గద్వాల్ నుంచి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అయితే ఎన్నికలు ముగిసి ఇంకా నాలుగు నెలలు కూడా కాలేదు. అంతలోనే వారికి కష్టాలు మొదలయ్యాయట. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు, అప్పుల సమాచారాన్ని సరిగా పేర్కోనలేదని ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సరిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సందర్భంలో అఫిడవిట్ లో బ్లాంక్ పెట్టారని, అలాగే పలు పెనాల్టీల అంశాలు, ఆస్తులు, అప్పులు వివరాలు చూపలేదని ఆరోపించారు. దీంతో ఆయన ఎన్నికను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కాంగ్రెస్ నేత సరిత.
ఇక, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జోగుళాంబ గద్వాల్ జిల్లాలోని ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్గా ప్రస్తుత అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు విధులు నిర్వర్తించారు. అయితే ఎన్నికల్లో నామినేషన్ కంటే ముందే ఉద్యోగానికి రాజీనామా చేయలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. నాటి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని హైకోర్టులో కేసు దాఖలు చేశారు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న కుమార్. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే తప్పనిసరిగా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యాగానికి రాజీనామా చేసి ఉండాలన్న ఆరోపణలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
గద్వాల్ ఎమ్మెల్యేకు గతంలోనే ఎదురుదెబ్బ
ఈ ఇద్దరు ఎమ్మెల్యేపై దాఖలైన కేసులను విచారించిన హైకోర్టు ఇరువురికి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 18వ తేదీ వరకు నోటీసులకు సమాధానం ఇవ్వాలని పేర్కోన్నట్లు సమాచారం. అయితే 2019 ఎన్నికల్లో అఫిడవిట్లో ఆస్తులు, అప్పులు సరిగా చూపించలేదన్న ఆరోపణలతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి వ్యతిరేకంగా డీకే అరుణ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు ఎమ్మెల్యేను డిస్ క్వాలిఫై చేయడంతో పాటు రూ.2.50లక్షల జరిమానా సైతం విధించింది. తిరిగి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో అక్కడ స్టే లభించింది. అయితే ప్రస్తుతం ఏం జరుగుతుందోనని ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఆందోళనలో ఉన్నారట.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..