
ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో జరిగింది. రాధమ్మ అనే వృద్దురాలు ఒంటరిగా జీవనం కొనసాగిస్తోంది. రాధమ్మకు ముగ్గురు కుమారులు వారిలో ఇద్దరు మహబూబాబాద్ లో నివశిస్తున్నారు.. మరొక కుమారుడు సూరత్ లో స్థిరపడ్డారు. భర్త కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందాడు. దీంతో వృద్ధురాలు ఒంటరిగా జీవనం సాగిస్తోంది. అయితే ఆమె మెడలో ఉన్న బంగారంపై కన్నేసిన కొందరు దుండగులు కాజేసేందుకు ప్లాన్ చేశారు. రాత్రి సమయంలో రాధమ్మ ఒంటరిగా ఉంటుందని గమనించిన దుండగులు చోరికి వచ్చారు.
దొంగలను గమనించిన రాధమ్మ వారితో చాలా సేపు ప్రతిఘటించింది. తీవ్ర గాయాలతో ప్రాణం పోతున్న తన మేడలోని గొలుసును మాత్రం దుండగుల చేతికి చిక్కనియ్యలేదు.. వాళ్లను ముప్పతిప్పలు పెట్టింది. ఇక ఇలా అయితే కుదరదని భావించిన దుండగులు రాధమ్మపై తీవ్రంగా దాడి చేసి ఆమెను హత్య చేశారు. ఆ తర్వాత ఆమె కాళ్ళ పట్టిలు, చేతి వెండి కడియం, 3 తులాల బంగారు ఆభరణాలు కాజేశారు. ఆ తర్వాత రాధమ్మ మృతదేహాన్ని సమీపంలోని బావిలో పడేసి అక్కడి నుండి గుట్టు చప్పుడు కాకుండా పారిపోయారు.
అయితే ఉదయం రక్తపు మరకల ఆధారంగా చేద బావిలో రాధమ్మ మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాధమ్మ మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే దుండగులతో తీవ్రంగా పోరాడిన రాధమ్మ తన గొలుసును మాత్రం వదలలేదు. మృతదేహం వెలికి తీసినప్పుడు ఆమెచేతిలో గొలుసు అలానే ఉంది. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.