Telangana: భక్తులకు గుడ్ న్యూస్.. మహా శివరాత్రికి 3 వేల ప్రత్యేక బస్సులు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్ర‌కారం శివరాత్రికి నడిచే స్పెష‌ల్ బ‌స్సుల్లో టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ సంస్థ సవరించింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వ‌ర‌కు టికెట్ ధ‌ర‌ల‌ను స‌వ‌రించింది. రెగ్యులర్ స‌ర్వీస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ నెల 24 నుంచి 27 తేది వరకు (నాలుగు రోజులు) నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే సవరణ టికెట్ ఛార్జీలు అమల్లో ఉంటాయి

Telangana: భక్తులకు గుడ్ న్యూస్.. మహా శివరాత్రికి 3 వేల ప్రత్యేక బస్సులు..
TGSRTC

Updated on: Feb 22, 2025 | 6:40 PM

మహా శివరాత్రి ప‌ర్వ‌దినాన్ని పురస్కరించుకుని శివాలయాల దర్శనానికి వెళ్లే భక్తులకు ర‌వాణా ప‌ర‌మైన అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా టీజీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. భ‌క్తుల సౌక‌ర్యార్థం తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 3 వేల ప్రత్యేక బస్సులను న‌డ‌పాల‌ని యాజ‌మాన్యం నిర్ణ‌యించింది. ఈ నెల 26న మ‌హా శివ‌రాత్రి కాగా, 24 నుంచి 28వ తేది వ‌ర‌కు ఈ ప్ర‌త్యేక బ‌స్సుల‌ను టీజీఎస్ఆర్టీసీ న‌డ‌ప‌నుంది.

ప్రధానంగా శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444, కీసరగుట్టకు 270, వేలాలకు 171, కాళేశ్వరానికి 80, కొమురవెల్లికి 51 బ‌స్సుల‌తో పాటు అలంపూర్, ఉమామ‌హేశ్వ‌రం, పాల‌కుర్తి, రామ‌ప్ప‌, త‌దిత‌ర ఆల‌యాల‌కు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, సీబీఎస్, ఐఎస్‌ సదన్‌, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈఎల్‌ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో షామియానాలు, చైర్‌లు, తాగునీరుతో పాటు ప‌బ్లిక్ అడ్ర‌స్ సిస్టంను సంస్థ ఏర్పాటు చేస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్ర‌కారం శివరాత్రికి నడిచే స్పెష‌ల్ బ‌స్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వ‌ర‌కు టికెట్ ధ‌ర‌ల‌ను స‌వ‌రించింది. రెగ్యులర్ స‌ర్వీస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ నెల 24 నుంచి 27 తేది వరకు (నాలుగు రోజులు) నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే సవరణ టికెట్ ఛార్జీలు అమల్లో ఉంటాయి. ఏడుపాయలకు తిరిగే స్పెషల్ బస్సుల్లో 26 నుంచి 28 తేది వరకు(మూడు రోజులు) సవరణ చార్జీలు వర్తిస్తాయి. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డులను సంస్థ ఏర్పాటు చేస్తుంది.

శివ‌రాత్రి ఆప‌రేష‌న్స్ పై ఆర్టీసీ ఉన్న‌తాధికారుల‌తో ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఇప్ప‌టికే స‌మీక్ష నిర్వ‌హించారు. శైవ‌క్షేత్రాల‌కు వెళ్లే భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో టీజీఎస్ఆర్టీసీ ప‌క‌డ్బందీ ఏర్పాట్ల‌ను చేస్తోంది. క్షేత్ర‌స్థాయి అధికారుల‌తో యాజ‌మాన్యం ఇటీవ‌ల స‌మీక్ష నిర్వ‌హించింది. 43 శైవక్షేత్రాలకు 3 వేల ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. గ‌త శివ‌రాత్రి క‌న్నా ఈ సారి 809 బ‌స్సుల‌ను అద‌నంగా సంస్థ న‌డపనుంది. ‘‘భ‌క్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ఈ ప్రత్యేక సర్వీస్‌లను ఉపయోగించుకుని క్షేమంగా శైవాలయాలకు చేరుకొని భక్తులు మొక్కులు చెల్లించుకోవాలి.” అని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ కోరారు.

మహాశివరాత్రి స్పెషల్ బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మి- మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. తమ ప్రయాణ సమయంలో మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని సూచించారు. హైద‌రాబాద్ నుంచి శ్రీశైలం, వేముల‌వాడకు వెళ్లే ప్ర‌త్యేక బ‌స్సుల‌కు ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ స‌దుపాయాన్ని క‌ల్పించామ‌ని, టికెట్ల బుకింగ్ ను www.tgsrtcbus.in వెబ్‌సైట్ లో చేసుకోవ‌చ్చ‌ని అన్నారు. మ‌హా శివరాత్రి స్పెష‌ల్ బ‌స్సుల‌కు సంబంధించిన స‌మాచారం కోసం టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంట‌ర్ నంబ‌ర్లు 040-69440000, 040-23450033ను సంప్ర‌దించాల‌ని సూచించారు.