
కడెం ప్రాజెక్ట్ను వానకాలం టెన్షన్ వెంటాడుతోంది. జులై మాసం వచ్చిదంటేనే చాలు తొలకరి పలకరించింది మొదలు.. రెండు రోజుల వానలకే నిండుకుండలా మారి ముచ్చటగా మూడో వర్షానికి వరద ఉప్పెనలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది కడెం. వరుసగా రెండేళ్లు వరద కష్టాలను ఎదుర్కొన్న కడెం ముచ్చటగా మూడవసారి వరదలను తట్టుకునేందుకు సిద్దమవుతోంది. గత రెండేళ్లుగా నిధుల లేమితో కొట్టామిట్టాడుతూ, మరమ్మత్తులకు నోచుకోలేక వరదల్లో మునుగుతూ తేలుతూ ప్రయాణం సాగించింది కడెం ప్రాజెక్ట్. ఈసారి మాత్రం అలాంటి పరిస్థితులను బలంగా ఎదుర్కుంటానంటోంది.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం రాకతో సమయానికి నిధులు విడుదలవడంతో పాత కష్టాలకు చెక్ పెట్టి మరమ్మత్తులతో కొత్త హంగులద్దుకుంటోంది కడెం ప్రాజెక్ట్. అయితే మరమ్మత్తు పనులు నత్తనడకన సాగుతున్నాయి. వర్షకాలం ప్రారంభకంటే ముందే మరమత్తులు పూర్తి కాకుంటే మళ్లీ పాతకథ పునరావృతం కావడం పక్కా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరి ఈసారైన జులై టెన్షన్.. కడెం ప్రాజెక్ట్ గట్టెక్కగలుగుతుందా..? తొలి వరద ముప్పును ఈసారి తట్టుకోగలుతుందా. ప్రస్తుత కడెం పరిస్థితేంటి.?
కడెం ప్రాజెక్ట్.. నిర్మల్ జిల్లా పెద్దూరు మండలంలో కడెం నదిపై నిర్మితమైన పురాతన ప్రాజెక్ట్. 1949లో 9 గేట్లతో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టగా పదేళ్ల పాటు అత్యదిక కాలం నిర్మాణమై.. 1958లో వినియోగం లోకి వచ్చింది. అయితే వినియోగంలోకి వచ్చిన ఏడాదిలోనే డిజైన్ డిశ్చార్జిని మించి వరద ప్రాజెక్ట్ ను ముంచెత్తడటంతో ఉన్న 9 గేట్లకు అదనంగా మరో 9 గేట్లు అమర్చాలన్న ఆనాటి నిపుణుల సూచించారు. దీంతో 18 గేట్లతో నిర్మాణం పూర్తి చేసుకుని 1969లో పూర్తిస్థాయిలో సాగుకు అందుబాటులోకి వచ్చింది కడెం ప్రాజెక్ట్. అయితే 2022 లో భారీగా పోటెత్తిన వరదతో ప్రమాదంలో పడింది.
జూలై 13 న వచ్చిన వరదలతో ఎక్కడ కొట్టుకు పోతుందో అన్న భయాన్ని కలిగించింది. ప్రాజెక్టు డిశ్చార్జ్ సామర్థ్యం 3 లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఏకంగా 6 లక్షల క్యూసెక్కుల వరద ముంచెత్తడంతో ప్రాజెక్ట్ ప్రమాదపు టంచుల్లోకి చేరింది. ప్రకృతి పుణ్యాన ఏదోలా బయటపడింది. అయితే ప్రాజెక్ట్ ను కాపాడాల్సిన అధికారులు చేతులెత్తేయడం.. గత ప్రభుత్వం మరమ్మత్తులకు నిధులు విడుదల చేయకపోవడంతో వరుసగా రెండవ సారి కూడా ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో 65 ఏళ్లు దాటిన కడెం ప్రాజెక్టు భద్రమా..? కాదా? అనే అంశంపై అధ్యయనం చేసేందుకు రంగంలోకి దిగింది కేంద్ర డ్యాం సేఫ్టీ నిపుణుల కమిటీ. కడెం ప్రాజెక్టు ప్రధాన స్పిల్ వేను పునర్నిర్మించాలని సూచించింది. డ్యాం 18 వరదగేట్లను, కాలువ పరిస్థితులను, ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో, గేట్ల కౌంటర్ వెయిట్లు, రూప్స్, అదనపు స్పిల్వే సామర్థ్యం, గేట్ల విడుదల రూపకల్పన, లోడ్ డిశ్చార్జ్ లను క్షుణ్ణంగా పరిశీలించిన కమిటి కొత్త స్పిల్వే నిర్మాణం పక్కా చేపట్టాలని సూచించింది.
అయితే ప్రభుత్వం మారడం తో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కడెం ప్రాజెక్ట్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. గత రెండేళ్ల అనుభవాల దృష్ట్యా ప్రాజెక్టు 18 గేట్లను ఏకకాలంలో ఎత్తడానికి వీలుగా 5 గేట్లలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ కు చేరడంతో వేసవి కాలం సాగు కు క్రాప్ హాలీడే ప్రకటించి మరమ్మత్తులు చేపట్టింది. ప్రాజెక్టు పరివాహక ప్రాంతం అంతా దట్టమైన అడవుల్లో ఉండటంతో.. ఎగువన మూడు ప్రాంతాల్లో రెయిన్ గేజ్ స్టేషన్లు ఏర్పాటు చేసి, వాటిని ప్రాజెక్టు వద్ద ఉన్న స్కాడా కేంద్రానికి అనుసంధానం చేసింది ప్రాజెక్ట్ అదికార యంత్రాంగం. వరద సమాచారం అందుకోగానే గేట్లను ఏకకాలంలో తెరిచేందుకు సిద్దంగా 18 గేట్ల మరమ్మత్తులను వేగవంతం చేసింది.
అయితే కడెం ప్రాజెక్ట్ కు అదిపెద్ద సమస్య విద్యుత్ వ్యవస్థ. కడెం ప్రాజెక్టు నిర్మించి 60 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆనాటీ విద్యుత్ వ్యవస్థతోనే నెట్టుకొస్తోంది ప్రాజెక్ట్ యంత్రాంగం. గతంలో వైరింగ్ వ్యవస్థ పని చేయక పలుమార్లు గేట్లు ఎత్తలేని పరిస్థితి నెలకొంది. బ్రిటిష్ కాలం నాటి వైరింగ్, ప్యానెల్ బోర్డ్స్, లైటింగ్ వ్యవస్థలతో తరచూ ఇబ్బందులు త లెత్తుతున్నాయని ప్రాజెక్ట్ సిబ్బంది చెపుతోంది. వాటి స్థానాల్లో కొత్త వైరింగ్, ప్యానెల్ బోర్డ్స్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు సిబ్బంది. ఈ ప్రాజెక్టుకు మొత్తం 18 వరద గేట్లు ఉండగా, వీటిని అపరేట్ చేసేందుకు 450 కిలోవాట్ సామర్థ్యం ఉన్న ట్రాన్స్ఫార్మర్ కావాలి.. కానీ ప్రాజెక్ట్ కి 100 కేవీ ట్రాన్స్ ఫార్మర్ మాత్రమే ఉండటం.. అది కూడా గ్రామానికి లింకు ఉండడంతో తరచూ కరెంట్ సమస్య తలెత్తుతోంది. దీంతో విద్యుత్ వ్యవస్థ పై ప్రత్యేకంగా అదికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నిపుణులు.
తాజాగా రేవంత్ సర్కార్ కడెం ప్రాజెక్ట్ ను వరదల నుండి కాపాడుకుందేకు.. వరదలకు దెబ్బతిన్న ప్రాజెక్ట్ మరమ్మతులకు రూ.5.46 కోట్ల నిధులు విడుదల చేసింది. అయితే పనులు దక్కించుకున్న కంపెనీ మాత్రం మందకొడిగా పనులు సాగిస్తుండటం మరోసారి వానకాలం కష్టాలను మోసుకొచ్చేలా కనిపిస్తోంది. అయితే ప్రాజెక్ట్ పై ఉన్న 18 గేట్లలలో 9 ఇండియన్ గేట్లలో ఏడు ఇండియన్ గేట్లకు రూలర్స్ అమర్చారు.. మరో రెండు గేట్లకు అమర్చాల్సి ఉంది. మొత్తం 18 వరద గేట్లలలో ఇప్పటి వరకు 11 వరద గేట్లకు రబ్బర్ సీల్స్ అమర్చారు. 9 జర్మనీ గేట్లలో 7 గేట్లకు గేర్ బాక్స్లు అమర్చారు. మరో రెండింటికి అమర్చాల్సి ఉంది.
మరో రెండు జర్మన్ మోడల్ వరద గేట్లకు కౌంటర్ వెయిట్లు, వైర్ రోప్స్ అమర్చాల్సి ఉంది. 9 జర్మనీ గేట్లలలో 7 గేట్లకు బ్రేక్ లైనర్స్ అమర్చగా.. మరో రెండు గేట్లకు అమర్చాల్సి ఉంది. మరో నాలుగు వరద గేట్లకు కొత్త మోటార్లు బిగించాల్సి ఉంది. వైరింగ్, ప్యానెల్ బోర్డ్స్, స్టార్టర్స్, ఎలక్ట్రికల్ పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో జూన్ రెండో వారం లోగా ఈ పనులన్నీ పూర్తవుతేనే మరోసారి వరద ముంపు నుండి గెలిచి నిలిచే అవకాశం ఉంది. లేదంటే ముచ్చటగా మూడవసారి కూడా కడెంకు వరద కష్టాలు తప్పవు.. దిగువ ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు కరువవక తప్పదంటున్నారు నిపుణులు. ప్రస్తుతానికి సివిల్ వర్క్ లో భాగంగా స్పిల్వే పనులు వేగంగా కొనసాగుతుండగా ఎలక్ట్రిక్ పనులు మరింత వేగం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..