
విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సులో ఉన్నట్టుండి మంటలు చెలరేగి బస్సు పూర్తి కాలిపోయిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలుగు చూసింది. బస్సులో పొగలను గమనించిన డ్రైవర్ అప్రమత్తమై రోడ్డుమీదే బస్సును ఆపేసి విద్యార్థులను కిందకు దించేశాడు. దీంతో పెను ముప్పు తప్పింది. ఈ ప్రమాదంలో బస్సు మొత్తం కాలిపోయింది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటలను అదుపుచేసి క్రెయిన్ సహాయంతో బస్సును తొలగించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చల్లగరిగే గ్రామంలోని రైజింగ్ సన్ స్కూల్కు చెందిన AP 36TA 1569 నెంబర్ గల స్కూల్ బస్సులో సాయంత్రం విద్యార్థులను డ్రాప్ చేసేందుకు స్కూల్ నుంచి బయల్దేరింది. మార్గమధ్యలో జూకల్ కెనాల్ సమీపంలోకి చేరుకోగానే బస్సు ఇంజన్లో ఒక్కసారిగా పొగలు రావడం స్టార్ట్ అయ్యాయి. గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమైన బస్సును రోడ్డు మీదే నిలిపివేసి విద్యార్థులను కిందకు దించాడు.
అయితే విద్యార్థులు బస్సులో నుండి దిగుతున్న క్రమంలోనే మంటలు స్టార్ట్ అయ్యాయి. కాసేపట్లో ఆ మంటలన్నీ బస్సు మొత్తం వ్యాపించాయి. బస్సు డ్రైవర్, స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటలను అదుపుచేశారు. అనంతరం బస్సును క్రెయిన్ సహాయంతో రోడ్డుపై నుంచి తొలగించారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించి ఈ ప్రమాదం జరిగింది పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 13 మంది విద్యార్థులు ఉన్నారని.. సకాలంలో డ్రైవర్ స్పందించి విద్యార్థులను కిందకు దించేయడంతో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని.. ప్రమాదంలో కేవలం బస్సు మాత్రమై కాలిపోయినట్టు అధికారులు తెలిపారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతకాకుండా స్కూల్ యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.