ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి హెల్త్ అప్‌డేట్ – కీలక విషయాలు చెప్పిన డాక్టర్లు

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరారు. ఆహారం తీసుకోకుండా ఆల్కహాల్ సేవించారని కుటుంబ సభ్యులు తెలపగా. వైద్యులు స్టమక్ వాష్ చేసి, రక్త, మూత్ర నమూనాలను పరీక్షలకు పంపారు. ప్రస్తుతం ఆయన స్పృహలోకి రాలేదు, కానీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పూర్తి స్పష్టత కోసం నివేదికలు, ఆయన మాటల కోసం ఎదురుచూస్తున్నారు.

ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి హెల్త్ అప్‌డేట్ - కీలక విషయాలు చెప్పిన డాక్టర్లు
Uday Krishna Reddy

Updated on: Jul 20, 2026 | 3:32 PM

హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక దాడి, వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో.. అతని ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు వివరించారు. ఉదయ్ కృష్ణారెడ్డిని.. అతని సోదరుడు, స్నేహితులు ఉదయం 9:30 గంటల సమయంలో ఆయన్ని ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రికి చేరే సమయానికి ఉదయ్ కృష్ణారెడ్డి పూర్తిగా స్పృహలో లేరని వైద్యులు తెలిపారు. ఆయన ఏదైనా మత్తు పదార్థం లేదా డిలిరియం కలిగించే సబ్‌స్టాన్స్‌ను సేవించి ఉంటారనే అనుమానంతో వైద్యులు తక్షణమే స్టమక్ వాష్ చేశారు. అదే విధంగా బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు.

వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయ్ కృష్ణారెడ్డి కీలకమైన ఆరోగ్య సూచికలు (వైటల్స్) అయిన బీపీ, పల్స్, ఆక్సిజన్ శాచురేషన్ నిలకడగా ఉన్నాయి. అయినప్పటికీ, ఆయన ప్రస్తుతం పూర్తి స్పృహలో లేరు. ఆయన డ్రౌజీ స్థితిలో ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. స్టమక్ వాష్ చేసినప్పుడు సేకరించిన కంటెంట్స్‌లో ఎటువంటి అసాధారణ పదార్థాలు, ఫుడ్ పార్టికల్స్ లేదా టాబ్లెట్లు కనిపించలేదని, అది క్లియర్ లిక్విడ్‌గా వచ్చిందని వైద్యులు స్పష్టం చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి సోదరుడు అందించిన సమాచారం ప్రకారం, ఆయన ఆదివారం రోజున  ఆహారం తీసుకోకుండా ఆల్కహాల్ ఎక్కువగా సేవించినట్లు తెలిపారు. ఉదయం కుటుంబ సభ్యులు గమనించినప్పుడు ఆయన బెడ్‌పక్కన ఆల్కహాల్ బాటిల్, శానిటైజర్ బాటిల్ ఉన్నాయని చెప్పారు. ఏదో ప్రమాదవశాత్తు సేవించి ఉంటాడేమోనని అనుమానంతోనే కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం ఆధారంగానే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి చికిత్సకు కొంతవరకు స్పందిస్తున్నారని, అన్‌కాన్షియస్ స్థితి నుంచి డ్రౌజీ స్థితికి మారారని వైద్యులు తెలిపారు. ఆయన పూర్తిగా స్పృహలోకి రావడానికి కనీసం 24 గంటల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. రక్త, మూత్ర పరీక్షల నివేదికలు అందిన తర్వాత, ఉదయ్ కృష్ణారెడ్డి స్పృహలోకి వచ్చి ఏం జరిగిందో వివరించిన తర్వాతే ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి స్పష్టత వస్తుందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతానికి ఎటువంటి అంచనాలకు రాకుండా, రిపోర్ట్స్ కోసం, ఆయన కోలుకోవడం కోసం వేచి చూస్తున్నామని వైద్య బృందం పేర్కొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us