
ఎండాకాలం పోయి నెల రోజులు గడుస్తున్నా.. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గట్లేదు. దీని కారణంగా ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఏపీ, తెలంగాణ ప్రజలకు రెండు రాష్ట్రాల వాతావరణ శాఖలు ఉపశమనం కలిగించే వార్త చెప్పాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి తోడు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో శనివారం తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం.. రాష్ట్రంలోని విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటుగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే వర్షాల సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అలాగే సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని.. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని తెలిపింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇతర జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.