Telangana: ‘రొటీన్ వద్దు.. సమ్‌థింగ్ స్పెషల్ కావాలి’.. అధికారులతో సీఎం ఇంట్రస్టింగ్ కామెంట్స్

రొటీన్‌గా అందరూ పనిచేస్తారు, కానీ గొప్పగా ఎట్లా పనిచేయాలో నేర్చుకోవాలంటున్నారు సీఎం కేసీఆర్‌. అసలు, ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు?. ఎవరినుద్దేశించి చేశారు?

Telangana: రొటీన్ వద్దు.. సమ్‌థింగ్ స్పెషల్ కావాలి.. అధికారులతో సీఎం ఇంట్రస్టింగ్ కామెంట్స్
CM KCR

Updated on: Nov 28, 2022 | 7:39 AM

సమన్వయం, సమష్టితో పనిచేస్తేనే అద్భుత ఫలితాలు సాధ్యమన్నారు సీఎం కేసీఆర్‌. అందుకు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమన్నారు. సాధించిన అభివృద్ధితో సంతృప్తి చెందకుండా గొప్పగా ఆలోచించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారాయన. నిజామాబాద్‌ అభివృద్ధిపై ఉన్నతస్థాయి రివ్యూ నిర్వహించిన సీఎం కేసీఆర్‌, నిన్నటికన్న రేపు ఎంత మెరుగ్గా పని చేయగలమో ఆలోచించాలన్నారు. రొటీన్‌గా అందరూ పనిచేస్తారు, కానీ గొప్పగా ఎట్లా పనిచేయాలనేదే ముఖ్యమన్నారు ముఖ్యమంత్రి.

మూస పద్ధతులను విడిచిపెట్టి, ప్రజాసమస్యలను వేగంగా ఎలా పరిష్కరించాలో ఆలోచించాలన్నారు. అప్పుడే ఉన్నతంగా ఎదగలమన్నారు సీఎం కేసీఆర్‌. ప్రజల ప్రాథమిక అవసరాలను ఎంత గొప్పగా తీర్చగలమనేదే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రధాన కర్తవ్యం కావాలన్నారు. ప్రగతిపథంలో దూసుకుపోతున్న నిజామాబాద్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. రోడ్‌మ్యాప్‌ రెడీ చేసుకుని రెండున్నర నెలల్లో నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, R&Bతో పాటు శాఖలన్నీ సమన్వయంగా పనిచేసి నిజామాబాద్‌ రూపురేఖలను మార్చేయాలన్నారు. రొటీన్‌గా కాకుండా సమ్‌థింగ్‌ స్పెషల్‌గా పనిచేసినప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు కేసీఆర్‌.

అభివృద్ధి విషయంలో నిధుల కొరతే లేదన్నారు. నిజామాబాద్‌ అభివృద్ధికి అవసరమైన నిధులను విడుదల చేయాలంటూ ఫైనాన్స్‌ సెక్రటరీకి ఫోన్‌ చేసి ఆదేశించారు సీఎం కేసీఆర్‌. అయితే, రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రికి వివరించారు మంత్రి కేటీఆర్‌. దేశంలోనే ఆదర్శవంతమైన పట్టణాలను తీర్చిదిద్దడంలో కృషిచేస్తున్నట్టు వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..