రాత్రిపూట వ్యాపారాలు.. రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్, యువత.. ఎక్కడో అనుకుంటున్నారా..?

| Edited By: Jyothi Gadda

Jun 10, 2024 | 3:41 PM

రాత్రిపూట వీరంగం సృష్టిస్తున్న పోకిరిలు తాగిన మైకంలో పోలీసు వాహనంపై రాయితో దాడి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదేంటని అడిగితే ఎదురుతిరిగి పోలీసులపైనే తిట్లు కురిపిస్తున్నాడు ఆ యువకుడు. ఇలాంటి సంఘటనలు రోజూ కనపడుతున్నా కట్టడి చేసేందుకు సరైన గట్టి చర్యలు తీసుకోవడం లేదు. ఇదంతా ఎక్కడో కాదు..

రాత్రిపూట వ్యాపారాలు.. రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్, యువత.. ఎక్కడో అనుకుంటున్నారా..?
hyderabad night business
Follow us on

హైదరాబాద్ నగరంలో గత కొన్నేళ్లుగా రాత్రిపూట రోడ్ల పక్కన టిఫిన్లు అమ్మడం ఎక్కువగా కనిపిస్తోంది. దానికి తోడు యువత కూడా ఓ సమయం అంటూ లేకుండా ఏ అర్ధరాత్రి అయినా సరే బయటికి వచ్చి టిఫిన్ చేసి వెళ్లడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో అది వ్యాపారస్తులకు కూడా మంచి రాబడి తెచ్చిపెడుతుండడంతో మరింత విస్తృతంగా సాగుతోంది. కానీ, ఇలా రాత్రిపూట నడిరోడ్లపై, ఫుట్ పాత్‌లపై వ్యాపారం సాగించే వాళ్లు అసలు పర్మిషన్ తీసుకుంటారో లేదో అన్నది ఇక్కడ ముఖ్యంగా వచ్చే సందేహం. దీనిపై హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం ఒప్పుకోవాల్సిన విషయమే.

ఇదంతా ఇలా ఉంటే.. ఇప్పుడు ఇలాంటి వ్యాపారాలు నిర్వహించడమే పెద్ద తలనొప్పిగా మారింది. పాతబస్తీలో రాత్రిపూట బిర్యానీ అని, మండీ అని, ఇడ్లీ దోశ వ్యాపారాలు అని నిర్వహిస్తుండడం అత్యంత ప్రమాదంగా మారింది. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పోలీస్ కనుసన్నుల్లోనే నడుస్తున్న కొన్ని వ్యాపారాలు అటు ప్రజలకు, ఇటు మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి ఇడ్లీ, దోశ, బిర్యాని తినడానికి రాత్రిపూట యువత క్యూ కడుతున్నారు. రాత్రి 11 గంటల తర్వాత వ్యాపార సముదాయాలు పూర్తిగా బంద్ చేయాలని హైదరాబాద్ నగర కమిషనర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేదు. వ్యాపారస్తులు స్థానిక పోలీసులతో కుమ్మక్కై వ్యాపారాలు యధావిధిగా కొనసాగిస్తున్నారు. అంత రాత్రిపూట తినడానికి వచ్చే వాళ్లతో పాటు మందుబాబుల ఆగడాలు ఎక్కువయ్యాయి. మరీ ముఖ్యంగా గంజాయి బ్యాచ్ ఇదే అదనుగా రాత్రివేళల్లో రెచ్చిపోతున్నారు.

గంజాయి బ్యాచ్ మత్తులో తూలుతూ ఏకంగా పోలీసులతో పాటు వారి వాహనాలపై దాడులు చేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాత్రిపూట ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్లినా బెదిరించి జులుం చూపించే పోలీసులు, అనవసరంగా రాత్రివేళల్లో రోడ్లపై తిరుగుతున్నారంటూ అమాయక ప్రజలపై లాఠీలు ఝుళిపించే పోలీస్ యంత్రాంగం.. మరి ఇలా గంజాయి బ్యాచ్ ఆగడాలపై, రాత్రిపూట నడుస్తున్న వ్యాపార సముదాయాలపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి చార్మినార్ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల పోలీసుల సహకారంతోనే వ్యాపారాలు కొనసాగుతున్నాయని, దానివల్ల అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి

నగర కమిషనర్ ఆదేశాలను పకడ్బందీగా పాటించాల్సిన పోలీసులే చూసీచూడనట్లు వ్యవహరించి రాత్రిపూట వ్యాపార సముదాయాలను ప్రొత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దానికి తగినట్లుగానే పోలీసులే మూల్యం చెల్లించాల్సిన సంఘటనలు కనపడుతున్నాయి. రాత్రిపూట వీరంగం సృష్టిస్తున్న పోకిరిలు తాగిన మైకంలో పోలీసు వాహనంపై రాయితో దాడి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదేంటని అడిగితే ఎదురుతిరిగి పోలీసులపైనే తిట్లు కురిపిస్తున్నాడు ఆ యువకుడు. ఇలాంటి సంఘటనలు రోజూ కనపడుతున్నా కట్టడి చేసేందుకు సరైన గట్టి చర్యలు తీసుకోవడం లేదు. ఈ మేరకు పాతబస్తీలో, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో రాత్రిపూట పూర్తిగా వ్యాపార సముదాయాలు కొనసాగకుండా పోలీసులు బంద్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..