మూడు టర్మ్ల భేటీలు.. అప్పుడు- ఇప్పుడు.. విభజన సమస్యలే అజెండా.. ఎస్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పట్లో ఏపీ సీఎం చంద్రబాబు- తెలంగాణ సీఎం కేసీఆర్ తొలిసారి భేటీ కాగా.. ఆ తర్వాత.. జగన్- కేసీఆర్ సమావేశమయ్యారు.. తాజాగా.. చంద్రబాబు- రేవంత్రెడ్డి మీట్ అయ్యారు. మూడు సార్లు కూడా విభజన సమస్యలే అజెండాగా సమావేశాలు నిర్వహించడం.. సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇంతకీ.. మూడు టర్మ్ల భేటీల్లో తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఏ మేరకు కొలిక్కి వచ్చాయి?.. తాజా సమావేశంలో సాధించిన పురోగతి ఏంటి?..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి పదేళ్లు గడిచిపోయింది. కానీ.. ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యలు మాత్రం కొలిక్కి రాలేదు. దాంతో.. నాటి నుంచి నేటి వరకు తెలుగు రాష్ట్రాల సీఎం సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. 2014- 2019 మధ్య అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను నాటి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కలిపారు. జూన్ 23, 2015న హైదరాబాద్లోని రాజ్భవన్లో ఈ భేటీ జరిగింది. అప్పుడు ఏపీ, తెలంగాణ మధ్య నీళ్లు-నిప్పుగా మారిన నాగార్జునసాగర్ డ్యామ్ విషయంలో చంద్రబాబు, కేసీఆర్లను కలిపి చర్చలు సాగేలా చేశారు నరసింహన్. నాడు నాగార్జునసాగర్ జలాల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య తలెత్తిన జల జగడాన్ని తీర్చడానికి అప్పటి గవర్నర్ నరసింహన్ చొరవ తీసుకుని ఆ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఇక.. 2019 ఎన్నికల్లో గెలిచాక, తన ప్రమాణ స్వీకారానికి రావాలంటూ ఆనాటి తెలంగాణ సీఎం కేసీఆర్ను అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆహ్వానించారు. ఆ తర్వాత.. 28 మే, 2019న జగన్ దంపతులు హైదరాబాద్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయనను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే… 2019లో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మధ్య మొదటిసారి విభజన సమస్యలపై చర్చ జరిగింది. జూన్ 26, 2019న హైదరాబాద్లోని కేసీఆర్ నివాసానికి జగన్ వెళ్లగా.. అప్పుడు ఇద్దరి మధ్య విభజన సమస్యలపై చర్చలు జరిగాయి. ఆ తర్వాత రెండోసారి కేసీఆర్ని కలిశారు నాటి ఏపీ సీఎం జగన్. రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు, నీటి పంపకాల గురించి చర్చించారు. జనవరి 13, 2020న కూడా హైదరాబాద్లో కేసీఆర్ నివాసానికి వెళ్లిన జగన్… నీటి పంపకాలు, గోదావరి జలాల తరలింపుపై కూడా ఇద్దరు నేతల మధ్య చర్చలు జరిగాయి.
ఇదిలావుంటే.. తాజాగా మరోసారి తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ హైదరాబాద్ వేదికగా జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు. ఏపీ, తెలంగాణ ప్రజలు ఆసక్తిగా చూసిన ఇద్దరు సీఎంల సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. సుమారు రెండు గంటల పాటు సాగిన సమావేశంలో విభజన అంశాలతో పాటు.. పదేళ్లుగా చర్చలు జరుగుతున్నా తేలకుండా ఉన్న విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించారు. ప్రధానంగా.. ఏపీ, తెలంగాణ మధ్య వివాదంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండు వారాల్లో ఈ కమిటీ సమావేశం కానుంది. ఉన్నతస్థాయి కమిటీ భేటీ తర్వాత కూడా సమస్యలు పరిష్కారం కాకుంటే.. మంత్రుల స్థాయిలో మరో కమిటీ ఏర్పాటు చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది. మొత్తంగా.. ఏపీ, తెలంగాణ సీఎంల మధ్య విభజన సమస్యలే అజెండాగా సాగిన మూడు దఫాల భేటీల్లోనూ క్లారిటీ రాకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి.. కమిటీలు ప్రకటించిన నేపథ్యంలో విభజన సమస్యలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..