
హైదరాబాద్, జూన్ 10: రాష్ట్రవాసులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) భారీ షాక్ ఇచ్చింది. ఆర్టీసీ బస్పాస్ ఛార్జీలు భారీగా పెంచుతూ ప్రకటన జారీ చేసింది. సాధారణ బస్ పాస్లతో సహా స్టూడెంట్ పాస్ ధరలను 20శాతానికిపైగా పెంచింది. ఈ మేరకు మంగళవారం (జూన్ 9) నుంచి కొత్త బస్ పాస్ ధరలు అమలులోకి వస్తాయని ఆర్టీసీ వెల్లడించింది. రూ.1150 ఉన్న ఆర్డినరీ పాస్ ధరను రూ.1400కు పెంచింది. ఇక రూ.1300 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధరను రూ.1600కు, రూ.1450 ఉన్న మెట్రో డీలక్స్ పాస్ను రూ.1800కు పెంచింది. ఇక గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలను సైతం ఆర్టీసీ పెంచింది.అయితే స్టూడెంట్ బస్పాస్తో ఆర్డినరీ బస్సు, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు.. రెండింటిలోనూ ప్రయాణించేందుకు విద్యార్థులకు అనుమతి ఇచ్చింది.
హైదరాబాద్లో ఇటీవలే మెట్రో రైలు టికెట్ ఛార్జీలు కూడా పెరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్టీసీ పాస్ ఛార్జీలు కూడా పెరగడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. తెలంగాణ ఆర్టీసీ నిర్ణయంతో విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలు, చిరుద్యోగులపై పెనుభారం పడింది. చార్జీల పెంపుపై పునరాలోచించాలని, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పలు విద్యార్థి, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటిఏ హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ ధరలు పెంచడంతో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పెంచిన ధరలపై 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అయితే దీన్ని అన్ని స్లాబ్లలో ఈ రాయితీని అమలు చేయకుండా తెలివిగా మెట్రో సంస్థ జనాల్ని మోసం చేసింది. టికెట్ కొనుగోలు సమయంలో చిల్లర సమస్యను సాకుగా చూపిస్తూ డిస్కౌంట్లలో గందరగోళం సృష్టించింది. ఇలా ఉన్నపలంగా బస్ పాస్ రేట్లు, మెట్రో టికెట్ రేట్లు పెరగడంతో ఉద్యోగులు, విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.