Telangana: విద్యుత్ కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా.. దేశ చరిత్రలోనే తొలిసారన్న డిప్యూటీ సీఎం భట్టి!
విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన కార్మికుడికి కోటి రూపాయల బీమా అందిచే పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు సోమవారం ఉదయం ప్రజాభవన్లో బాధిత కుటుంబ సభ్యులకు చెక్కును అందజేసి పథకాన్ని ప్రారంభిచారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దీంతో పాటు మృతుడు భార్యకు విద్యుత్ శాఖలో కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణలోని విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కార్మికులు కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద, విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ కార్మికుల కుటుంబాలకు రూ. 1 కోటి బీమా మొత్తం అందించబడుతుంది. ఈ క్రమంలోనే ఎన్పీడీసీఎల్లో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన జోగు నరేశ్ కుటుంబానికి ఈ పథకం కింద రూ. 1 కోటి చెక్కు అందజేయడంతో పాటు, ఆయన భార్యకు కారుణ్య నియామకం ఉత్తర్వులు జారీ చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన కార్మికుడికి కోటి రూపాయల బీమా చెక్కు అందించడం దేశంలో ఇదే తొలిసారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే ఇందిరమ్మ రాజ్యంలోనే ఇలాంటి గొప్ప నిర్ణయాలు సాధ్యమవుతాయన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి బీమాను అందుబాటులోకి తీసుకురాలేదని తెలిపారు.
ప్రమాదానికి గురైన కార్మికులకు, వారి కుటుంబాలకు అండగా ఉండేలా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు నిజమైన సంక్షేమ పాలనకు నిదర్శనం అని ఆయన అన్నారు. ఈ పథకాన్ని తొలుత సింగరేణిలో ప్రవేశపెట్టి, తర్వాత విద్యుత్ సంస్థలకూ విస్తరించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కార్మికులకు రూ.కోటి బీమా ఎంతో భరోసానిస్తుందని ఆయన అన్నారు. ఇది కేవలం ఒక్క కుటుంబానికే కాదని.. మొత్తం విద్యుత్ శాఖ కార్మికుల ఉత్తేజమని డిప్యూటీ సీఎం భట్టి చెప్పుకొచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
