
Hyderabad Old City Politics: మజ్లిస్కు కంచుకోట పాతబస్తీ.. ముస్లింలే ఆ పార్టీ ఓటు బ్యాంకు. అక్కడ ఏ పార్టీ పోటీచేసినా మజ్లిస్ చేతిలో ఓటమి ఖాయం. అలాంటి చోట పాగా వేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. మజ్లిస్, బీఆర్ఎస్ బంధాన్ని వ్యతిరేకిస్తున్న ముస్లింలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మజ్లిస్లో ఇంటిపోరును.. ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు హస్తం నేతలు ఫోకస్ చేశారు. దీంతో ఈసారి తమదే విజయం అనే ధీమాతో ఉన్న కాంగ్రెస్.. పాతబస్తీలో మజ్లిస్కు చెక్ పెట్టాలని భావిస్తోంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ముస్లింలు కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నారని ఆ పార్టీ ధీమాగా చెప్పుకుంటోంది.
మజ్లిస్ ప్రాతినిథ్యం వహించే 7 సీట్లలో కనీసం మూడైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మలక్పేట్, కార్వాన్, నాంపల్లి సెగ్మెంట్లలో కాంగ్రెస్ బలమైన అభ్యర్థులను బరిలో దించి, ప్రచారాన్ని మొదలు పెట్టింది. మజ్లిస్లో అసమ్మతి నేతలను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. పాతబస్తీలో ఇప్పటివరకూ ముస్లింలు మజ్లిస్కు సపోర్ట్గా నిలబడుతూ వచ్చారు.. అయితే, ఈసారి అలా ఉండదంటూ పేర్కొంటున్నారు.
మలక్పేట్, కార్వాన్, నాంపల్లి సెగ్మెంట్లలో కాంగ్రెస్ ప్రచారం మొదలుపెట్టింది. మలక్పేట్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి షేక్ అక్బర్పై ఎంఐఎం నేతలు దాడికి యత్నించడం కలకలం రేపింది. మసీదు దగ్గర ప్రచారం చేస్తున్నారని ఎంఐఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వీడియోలు పరిశీలించిన పోలీసులు ఎంఐఎం నేతలపైనే కేసు నమోదు చేశారు. అటు కార్వాన్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి ఉస్మాన్ను ఎంఐఎం నేతలు అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొని, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేంద్ర, రాష్ట్ర బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో తమకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
వాస్తవానికి పాతబస్తీలో అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను బరిలో దించుతాయి. కానీ అక్కడ మజ్లిస్ని కాదని.. ప్రచారానికి వెళ్లాలంటేనే చాలా కష్టమని పలువురు పేర్కొంటున్నారు.. ఇతర పార్టీల కార్యకర్తలు ప్రచారానికి వెళ్తే, MIM నేతలు దాడులకు పాల్పడుతున్నారని.. ఎన్నికల ప్రచారం చేసే హక్కు అన్నీ పార్టీలకు ఉంటుందని.. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని బరిలో ఉన్న పలు పార్టీల నేతలు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..