Hyderabad: పైకి చూసి యానిమల్ లవర్స్ అనుకునేరు.. మ్యాటర్‌లోకి వెళ్తే మైండ్‌పోతుంది

పైన పేర్కొన్న ఫోటోను ఓ సారి గమనించారా.? బండి మీద గొర్రెను తీసుకుని వెళ్తున్నారు కదా.! ఏదో హాస్పిటల్‌కు వెళ్తున్నారని అనుకునేరు. కట్ చేస్తే.. అసలు మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు. అదేంటో.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Hyderabad: పైకి చూసి యానిమల్ లవర్స్ అనుకునేరు.. మ్యాటర్‌లోకి వెళ్తే మైండ్‌పోతుంది
Representative Image

Edited By: Ravi Kiran

Updated on: Oct 28, 2025 | 8:18 AM

హైదరాబాద్‌ పాతబస్తీలో మరోసారి దొంగతనానికి సంబంధించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫతేహ్‌దర్వాజా ప్రాంతానికి చెందిన గొర్రెల యజమాని తన గొర్రెలను దొంగలు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై షాహ్‌అలీబండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫతేహ్‌దర్వాజాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గొర్రెల యజమాని మాట్లాడుతూ మా ప్రాంతంలో కొంతకాలంగా దొంగతనాల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల మా ఇంటి వద్ద ఉన్న గొర్రెలను ఇద్దరు వ్యక్తులు దొంగిలించారు. ఈ సంఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్‌ అయింది. ఆ వీడియోలో ఆ ఇద్దరు దొంగలు గొర్రెలను బండిపై తీసుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అని తెలిపారు. ఆయన చెప్పిన ప్రకారం సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తున్నవారిని గుర్తించేపనిలో పడ్డారు పోలీసులు.

‘నేను ఒక గొర్రెల యజమాని ఎప్పుడూ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ముందుంటాను. కానీ ఇప్పుడు నాకు ఎదురైన ఈ సంఘటన ఎంతో బాధాకరం. గొర్రెలే తమ కుటుంబానికి జీవనాధారంగా ఉన్నాయి. దాన్ని దొంగిలించడం వల్ల మా కుటుంబం ఇబ్బందుల్లో పడింది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై గొర్రెల యజమాని షాహ్‌అలీబండ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించి, దొంగలను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్థానిక కెమెరాలు, దుకాణాల సీసీటీవీ రికార్డులను కూడా పరిశీలిస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి. సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తున్న ఈ ఇద్దరు వ్యక్తులను ఎవరు గుర్తిస్తే వారు నేరుగా షాహ్‌అలీబండ పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించవచ్చు. ఫతేహ్‌దర్వాజా, శంకర్‌గంజ్‌ ప్రాంత ప్రజలు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ వీడియోలను విశ్లేషిస్తున్నారు. ఆ దొంగలు సమీప ప్రాంతాలకు చెందినవారే అయ్యి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగలను త్వరగా పట్టుకునేందుకు స్పెషల్‌ టీంలను ఏర్పాటు చేశారు. పశువుల దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని, రాత్రి పహారాలను బలపరచాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. గొర్రెల యజమాని పోస్ట్‌ చేసిన సీసీటీవీ వీడియోను చాలామంది షేర్‌ చేస్తున్నారు.