
సోషల్ మీడియా, డేటింగ్ యాప్లు, మెసేజింగ్ ప్లాట్ఫారమ్ల ద్వారా పరిచయమయ్యే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల “లవ్ స్కామ్”లు, “రోమాన్స్ ఫ్రాడ్”లు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ విభాగం ప్రత్యేక అవగాహన పోస్టర్ను విడుదల చేసింది. ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తి తక్కువ సమయంలోనే అత్యంత సన్నిహితంగా మారి ప్రేమ పేరుతో నమ్మకం సంపాదించి, చివరికి అత్యవసరం అంటూ డబ్బు అడగడం ఈ తరహా మోసాల ప్రధాన లక్షణమని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
“Hello”తో మొదలైన పరిచయం.. “Good Morning”, “I Miss You”, “I Love You” అంటూ వేగంగా భావోద్వేగ బంధం పెంచుకుని, చివరికి “రూ.5000 అత్యవసరంగా పంపండి” అనే దశకు చేరుకుంటుంది.. ప్రేమ ఎంత వేగంగా పెరుగుతుందో… అదే వేగంతో మోసం కూడా దగ్గరపడే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు
తెలియని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు పంపొద్దని, ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తి నిజమైన గుర్తింపును పూర్తిగా ధృవీకరించుకున్న తర్వాతే నమ్మాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయొద్దని, అనుమానాస్పద సోషల్ మీడియా లేదా డేటింగ్ ప్రొఫైల్లను వెంటనే రిపోర్ట్ చేయాలని సూచించారు. భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని మోసగాళ్లు లక్షల రూపాయలు కాజేస్తున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఒకవేళ ఇలాంటి స్కామ్ల బారిన పడినా, డబ్బు పంపిన వెంటనే ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ హెల్ప్లైన్ 1930కు ఫోన్ చేయాలని, సమీప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ సిటీ పోలీసులు సూచించారు. సమయానికి ఫిర్యాదు చేస్తే నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..