హైదరాబాద్ మెట్రోను L&T నుంచి టేకోవర్ చేసుకోని పేర్లను పంపండి.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ

హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణం.. ప్రతిపాదనలు, కమిటీ పేర్ల విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి .. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. L&T నుంచి 'మెట్రో నెట్వర్క్' ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ఆ తర్వాత మెట్రో రెండో దశ నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలు పంపాలని కోరారు.

హైదరాబాద్ మెట్రోను L&T నుంచి టేకోవర్ చేసుకోని పేర్లను పంపండి.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ
Revanth Reddy, Kishan Reddy

Edited By:

Updated on: Jan 16, 2026 | 4:08 PM

హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణం.. ప్రతిపాదనలు, కమిటీ పేర్ల విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి .. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. L&T నుంచి ‘మెట్రో నెట్వర్క్’ ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ఆ తర్వాత మెట్రో రెండో దశ నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలు, కమిటీకి సంబంధించిన పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సకాలంలో పంపించాలని కిషన్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు లేఖలో పలు కీలక విషయాలను ప్రస్తావించారు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో భాగంగా హైదరాబాద్ మెట్రో రెండో దశ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరిన విషయం తెలిసిందే. ఇప్పటికే అమలు జరుగుతున్న మొదటి దశ మెట్రోను L&T నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ప్రభుత్వమే నిర్వహిస్తుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.

దీనిలో భాగంగా.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసి.. తాను మెట్రో రెండో దశ నిర్మాణం గురించి చర్చించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ముందుగా మెట్రో మొదటి దశను L&T నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకోవాలని, అందుకు అన్ని ఒప్పందాలు, నిర్ణయాలు, లావాదేవీలు పూర్తి కావాలని చెప్పారన్నారు. లావాదేవీలు పూర్తయిన తర్వాత రెండో దశ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి అంగీకరించిందని కూడా మనోహర్ లాల్ ఖట్టర్ గుర్తు చేశారని తెలిపారు.

మెట్రో మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం L&T నుంచి తీసుకోవడం, రెండో దశకు సన్నాహాల కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా కమిటీ ఏర్పాటుచేయడంపై ఇప్పటికే.. సీఎంతో కలిసి నిర్ణయించామని మనోహర్ లాల్ ఖట్టర్ తనకు చెప్పారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు, కేంద్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు అధికారుల పేర్లను పంపాలని కోరినట్లు కూడా వివరించారు. కానీ, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారుల పేర్లను ప్రతిపాదించలేదని తెలిపారు. కావున వెంటనే ఇద్దరు అధికారుల పేర్లు పంపి సమావేశ నిర్వహణకు ప్రయత్నం చేయాలని.. సీఎం రేవంత్ రెడ్డిని.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖలో కోరారు.

అదేవిధంగా, వేగవంతంగా L&T నుంచి ‘మెట్రో నెట్వర్క్’ ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ఆ తర్వాత మెట్రో రెండో దశ నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని.. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కిషన్ రెడ్డి లేఖలో కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..