
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపికబురు అందింది. త్వరలో ప్రత్యేక కోచ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం తిరుగుతున్న మెట్రో రైళ్లల్లో కొత్త కోచ్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న రైళ్లల్లోని కోచ్లు ప్రయాణికుల రద్దీ అవసరాలకు తగ్గట్లు లేవు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు నిల్చోని ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉండటంతో కనీసం నిల్చోని ప్రయాణం చేయడానికి కూడా ఖాళీ ఉండటం లేదు. దీంతో తర్వాతి ట్రైన్ కోసం నిరీక్షించాల్సి వస్తోంది. ప్రస్తుతం సమ్మర్ కావడంతో మెట్రోలో రద్దీ విపరీతంగా పెరిగింది. జనంతో మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయి.
ఈ క్రమంలో మెట్రో రైళ్లల్లో కొత్త కోచ్లు తీసుకురావాలని అధికారులు ఎప్పటినుంచో భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు మరో ముందడుగు పడింది. ఇటీవల మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో కొత్త కోచ్ల ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. ఇందుకు వేగంగా చర్యలు చేపడుతున్నారు. దాదాపు 60 కొత్త కోచ్లను కొనుగోలు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త కోచ్ల కోసం బెంగళూరుకు చెందిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్తో చర్చలు జరుపుతోంది. ఆ సంస్థ కొత్త కోచ్లను సరఫరా చేయనుండగా.. త్వరలో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనుంది. త్వరలోనే అధికారికంగా ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్ ఇస్తే.. 15 నెలల్లోనే కొత్త కోచ్లను బీఈఎంఎల్ సరఫరా చేయనుంది. ప్రస్తుతం నగరంలోని మూడు కారిడార్లలో 56 మెట్రో రైళ్లు సర్వీసులు అందిస్తున్నాయి. ఒక్కొ రైలుకు 3 కోచ్లు మాత్రమే ఉండగా.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇవి సరిపోవడం లేదు. దీంతో కొత్త కోచ్లను ఏర్పాటు చేస్తే ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి. ప్రయాణికులు నిల్చోని ప్రయాణం చేసే సమస్య కాస్త తగ్గుతుంది. రైళ్ల ఫ్రీక్వెన్సీ పెరగడమే కాకుండా ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యం పెరుగుతుంది. దీని వల్ల మెట్రో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందనుంది.